Minister Harish Rao | పంచాయతీ సెక్రెటరీలు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులేనని, మరింత ఉత్సాహంతో కష్టపడి పని చేయాలని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ నియోజకవర్గంలో 75 మంది పంచాయతీ సెక్రెటరీ రిజర్వేషన్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో తెలంగాణ పల్లెలాంటి పల్లెలు కనపడవన్నారు. ప్రతి ఊర్లో ట్రాక్టర్ ట్రాలీ, నర్సరీ, డంప్ యార్డ్, వైకుంఠధామాలతో విజయవంతంగా పల్లెలను పరిశుభ్రంగా కాపాడుకుంటున్నామన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మాత్రమే కాకుండా సీజనల్ రోగాలు తగ్గాయన్నారు.
వానాకాలం వచ్చిందంటే గతంలో రోగాలతో ఊర్లు వణికి పోతున్నాయంటూ వచ్చే వార్తలను చూసేవాళ్లమన్నారు. ప్రస్తుతం మిషన్ భగీరథ, పల్లె ప్రగతితో ఆ పరిస్థితి లేదన్నారు. పల్లెలలో అంటువ్యాధులు నిర్మూలించగలిగామని, ప్రతి తాండను గ్రామపంచాయతీ చేసుకొని.. కొత్త గ్రామ పంచాయతీలో సెక్రెటరీ ఉండాలని సీఎం కేసీఆర్ కొత్తగా 10వేల పోస్టులను భర్తీ చేశారన్నారు. దేశంలో 3శాతం జనాభా ఉన్న తెలంగాణకు 38శాతం అవార్డులు గ్రామపంచాయతీలకు వస్తున్నాయంటే సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 80వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని, డాక్టర్ల ఉత్పత్తిలో సైతం తెలంగాణ నెంబర్ వన్గా మారిందన్నారు.
అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తండ్రిలా ఆలోచించి సీఎం కేసీఆర్ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తున్నారన్నారు. కల్మషం లేని ప్రేమ కేసీఆర్దని, ఉద్యోగం ఇచ్చింది కేసీఆరేనని.. మళ్లీ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసిందీ ఆయననన్నారు. ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అనే నానుడి దేశంలో నడిచిందని, ఇప్పుడు తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందన్నారు. ఇది కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు.