Minister Harish Rao | ‘మీరు నాపై చూసిస్తున్న ప్రేమకు నా కళ్లల్లో నీళ్లు వస్తున్నయ్. మీ ఆదరణకు ఎంత చేసినా తక్కువే. ఇంకా మీకు చాలా సేవ చేయాలి’ అంటూ మంత్రి హరీశ్రావు భావోద్వేగానికి గురయ్యారు. సిద్ధిపేట రూరల్ మండలం రాఘవాపూర్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అంతకు ముందు సిద్దిపేట శివాజీ సర్కిల్ నుంచి రాఘవాపూర్ వరకు విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండాను మంత్రి ఆవిష్కరించారు.
అనంతరం కార్యక్రమంలో కార్యక్తరలనుద్దేశించి మాట్లాడారు. ‘మీ బలగం చూస్తుంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు. చివరి శ్వాస వరకు సేవ చేస్తా. మీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి ఇచ్చిన తక్కువే. ఈ గడ్డ గులాబీ అడ్డా రానే రాదు అన్న తెలంగాణను, కానే కాదు అన్న కాళేశ్వరాన్ని కట్టి మండుటెండల్లో మత్తల్లు కేసీఆర్ దుంకిస్తున్నారు’ అన్నారు. వెనుకట పంట వేయాలి అంటే మోగులు వైపు చూసేదని, నేడు కేసీఆర్ దయతో కాలంతో సంబంధం లేకుండా పంట వేయవచ్చన్నారు.
రూ.138కోట్ల వడ్లు తెలంగాణ వచ్చినప్పుడు పండితే.. నేడు రూ.1548 కోట్లు వడ్లు పండుతున్నాయన్నారు. కేసీఆర్ అనే అద్భుత దీపం వల్లనే పంటలు పండుతున్నాయన్నారు. రాష్ట్రం వచ్చాక ఎరువుల కోసం ఇబ్బంది లేదని, నేడు ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నాడన్నారు. కాళేశ్వరం దండగా అన్న ప్రతిపక్షాలు గ్రామాలలోకి వస్తే పండగ.. దండగో తెలుస్తుందన్నారు. మోదీ నిన్నటి సభలో రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మోదీ మాటలు దొంగే దొంగా అన్నట్లు ఉన్నాయని విమర్శించారు. మోదీ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం అపిండని, కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలని రూ.30వేలకోట్లు ఆపిండన్నారు.
తెలంగాణ అభివృద్ధి ని బీజేపీ అడ్డుకుంటుందని, ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కారులో కరెంట్ సరఫరా లేక ఆయిల్ పోసి మోటార్లు నడుపుతున్నారన్నారు. రెండు కోట్లతో పుల్లుర్ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అభివృద్ధి చేసుకున్నామని, త్వరలోనే గృహలక్ష్మి కార్యక్రమం ప్రారంభం చేసుకుందామన్నారు. కాంగ్రెస్, బీజేపి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వలేదన్నారు. గాంధీ, నిమ్స్ ఆసుపత్రిల్లో ఉన్న సేవలు సిద్దిపేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పెట్టి అందిస్తామన్నారు.