Minister Harish Rao | సిద్దిపేట, నవంబర్ 16 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఎన్నికల కమిషన్నుంచి అనుమతి రాగానే వారంలోపే రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఒకవేళ అనుమతి రాకుంటే డిసెంబర్ 3 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రుపాయి లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ‘ప్రతిపక్షాలకు ఎజెండా లేకనే బూతులు మాట్లాడుతున్నయి. బూతులు కావాల్నా.. భవిష్యత్తును అందించే నాయకుడు కావాల్నా? ప్రజలు ఆలోచించుకోవాలి. సీఎం కేసీఆర్ వచ్చాక రూ.2 వేల ఆసరా పింఛన్ వస్తున్నది.
పేదింటి ఆడపిల్ల పెండ్లిల్లకు కల్యాణలక్ష్మి వస్తున్నది’ అని పేర్కొన్నారు. గురువారం మంత్రి హరీశ్రావు నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని, మాట్లాడారు. ఎండాకాలంలో మంజీరలో, హల్దీలో నీళ్లు లేవని మదన్రెడ్డి చెప్పగానే.. మల్లన్నసాగర్ నుంచి నీళ్లు వదిలామని, అన్ని మండలాల్లో నీటి మట్టం పెరిగిందని చెప్పారు. నేడు ఒక్క గుంట ఎండకుండా పంట పండేటట్టు చేసింది సీఎం కేసీఆరే అని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రైతుబంధు రూ.16 వేలకు పెరుగుతుందని వెల్లడించారు. పింఛన్ రూ.5 వేలు అవుతుందని, గ్యాస్ సిలిండర్ను రూ.400కే అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు 3 గంటలే కరెంట్ చాలని, రైతుబంధు దుబారా అని, ధరణిని తీసేస్తామని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ధరణి వద్దన్నోళ్లను బంగాళాఖాతంలో కలుపాలని పిలుపునిచ్చారు.
నర్సాపూర్ అంటే గులాబీ జెండా అడ్డా అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. 2001 నుంచి తెలంగాణకోసం నడుం బిగించిన గడ్డ ఇదని తెలిపారు. ఉద్యమస్ఫూర్తితో ఈ ఎన్నికల్లో సునీత లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలిపునిచ్చారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రాణాలకు తెగించి పోరాడితేనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు. ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఉంటే వందల మంది పిల్లల ప్రాణాలు కాపాడగలిగే వాళ్లమని చెప్పారు. అందుకే రేవంత్రెడ్డి సోనియాను ఇటలీ బొమ్మ, బలిదేవత అన్నారని గుర్తుచేశారు. కుర్చీ కోసం ఇప్పుడు రేవంత్ మాట మార్చాడని దుయ్యబట్టారు. ఈసారి కూడా కేసీఆర్ను దీవించి, హ్యాట్రిక్ సీఎంగా చేద్దామని పిలుపునిచ్చారు.