సిద్దిపేట: సిద్దిపేట (Siddipet) పరుగుల సందడిగా మారిందని, సరికొత్త కార్యక్రమానికి వేదికైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వేదికగా మారిందని చెప్పారు. సిద్దిపేట సరికొత్త ఆవిష్కరణ హాఫ్ మారథాన్ (Half marathon) అని తెలిపారు. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన పట్టణాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాల స్ఫూర్తితో ముందుకు పోతున్నామన్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్లో హాఫ్ మారథాన్ను మంత్రి హరీశ్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం, స్విమ్మింగ్ ఫుల్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో స్విమ్మింగ్ పోటీలు, వాలీబాల్, ఫుట్బాల్ పోటీల సెలెక్షన్స్కు, క్రికెట్ సెలెక్షన్స్ జరిగాయని చెప్పారు. జాతీయ స్థాయిలో హ్యాండ్బాల్ పోటీలకు సిద్దిపేట వేదికైందని వెల్లడించారు.
రంగనాయక సాగర్ వేదికగా రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు జరిగాయని, నేడు సిద్దిపేట నుంచి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి చెప్పారు. ప్రతీరంగంలో పట్టణం ఆదర్శంగా నిలవాలని, ప్రతిఒక్కరికి స్ఫూర్తి చాటాలన్నదే తన తపన అని వెల్లడించారు. కాగా, హాఫ్ మారథాన్ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నప్పుడే అద్భుతమైన స్పందన వచ్చిందని, రన్నింగ్ చేసే వారు ఇంత మంది ఉంటాంటేనే ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. రన్నింగ్ అనేది మన దినచర్యలో ఒక భాగం కావాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యంమని, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ రన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ఏడాది హాఫ్ మారథాన్ రన్ నిర్వహిస్తామని చెప్పారు. ప్లాస్టిక్ రహిత హాఫ్ మారథాన్ నిర్వహించడం మొదటి సారని వెల్లడించారు.