సిద్దిపేట : ఉత్తర భారతానికో నీతి, దక్షిణ భారతానికో నీతిగా కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రూ.1.71కోట్లతో నిర్మించి డివిజనల్ ఇంజినీర్ కార్యాలయ భవనం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఒడితెల సతీశ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ లో రూ.1.71 కోట్ల విద్యుత్ డీఈ కార్యాలయం ప్రారంభం చేసుకున్నామన్నారు. పట్టణ పరిసర ప్రాంత ప్రజలు గతంలో కరీంనగర్, సిద్ధిపేట వెళ్లే పరిస్థితి ఉండేదని, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఇక నుంచి ఎలాంటి విద్యుత్ సమస్య పనులకు హుస్నాబాద్లోనే చేసుకునే వెసులుబాటు కలిగిందన్నారు.
డీఈ అధికారి పోస్టు మంజూరుతో పాటు నూతన భవన ప్రారంభం చేసుకున్నామన్నారు. అలాగే హుస్నాబాద్ నాగ సముద్రాల వద్ద 220/132 కేవీ సబ్ స్టేషన్ గతంలో మంజూరు చేసుకున్నామని, పనులు పూర్తి కావొచ్చాయని తెలిపారు. రూ.50 కోట్లతో నిర్మిస్తున్న సబ్ స్టేషన్ను మార్చి 31లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్ సీఎండీలు రఘుమారెడ్డిని ఆదేశించారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న రామవరం, సీసీ పల్లి సబ్ స్టేషన్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. రామవరం సబ్ స్టేషన్ మార్చి 31లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతులకు ఏమైనా మేలు చేస్తుందోనని ఎదురు చూస్తే.. కేంద్రం వైఖరి రైతులపై భారం వేయడం తప్ప, రైతులకు మేలు చేసిందేమీ లేదని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతీ సంవత్సరం రాష్ట్ర జీఎస్ డీపీలో 4శాతం అప్పు రూపేణా తీసుకునే అనుమతి, అవకాశం ఉండేదని, కానీ ఈ సారి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 3.5 శాతం రాష్టాలకు నేరుగా ఇస్తామని, మరో ఒక అర శాతానికి విద్యుత్ సంస్కరణలు తేవాలని నిబంధనలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ చట్టంలో రీఫామ్స్, సవరణలు చేయాలని.. సంస్కరణలు బాయిల కాడ విద్యుత్ మీటర్లు పెట్టాలని, విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటు పరం చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ విధానమని కేంద్రంపై మంత్రి హరీశ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానం ఒక్కటే.. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ బాయిలకాడ మీటర్లు పెట్టనని, మీటర్లు పెడితే అరశాతం రూ.5వేల కోట్లు మన రాష్ట్రానికి రానట్లేనని, దీంతో తెలంగాణకు రూ.5వేల కోట్ల కోత పడినట్లేనని ఆర్థిక మంత్రి హరీశ్ వెల్లడించారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎవరికీ ఏమీ ఇచ్చింది లేదని, ఇచ్చే దాంట్లోనే కోతలు పెడుతున్నది. ఎందుకు ఈ నిబంధనలంటూ.. మా రాష్ట్ర ప్రభుత్వ విధానంలో మా రాష్ట్ర ప్రజలకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు బాయిలకాడ, బోర్లకాడ ఇస్తున్నట్లు, గత ఏడేండ్లుగా అందిస్తున్నట్లు, ఇందుకోసం యేటా రూ.12వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. కానీ, కేంద్ర బీజేపీ విద్యుత్ సంస్కరణలు తేవాలంటూ రాష్ట్రాల మెడలపై కత్తి పెడుతున్నదని, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతుందంటూ ఫైర్ అయ్యారు. ఒకప్పుడు రూ.400 గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ నేరుగా బ్యాంకులో వేస్తామని, కేవలం ఏడాది ఇచ్చి.. ఏటా 6 సార్లు 2400 వరకూ ఇచ్చినట్లే ఇచ్చి, ఇవాళ రూ.40 బీజేపీ దిగజారిందన్నారు.
ఈ నెల 1న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎఫ్సీఐకి సైతం కోత పెట్టారన్నారు. రైతులు పండించిన ధాన్యం సేకరించే ఎఫ్సీఐ సబ్సిడీలో దాదాపు రూ.40వేల కోట్ల కోత పెట్టారని, ఎఫ్సీఐ నిధుల కోత అంటే రాబోయే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనడంలో ఎఫ్సీఐ నిధుల కోత అంటే రాబోయే రోజుల్లో రైతుల దగ్గర నుంచి ధాన్యంలో కూడా కోతే పెడతారని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనని చెప్పకనే కేంద్రం చెబుతున్నదని కేంద్ర బీజేపీపై మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
రైతులకు ఇచ్చే అన్నీ సబ్సిడీలు తగ్గించి రైతులకు భద్రత లేకుండా చేసిందన్నారు. ఉత్తర భారత దేశంలో యూరియా, డీఏపీ ఎక్కువ వాడకం, దక్షిణ భారతదేశంలో కాంప్లెక్స్ ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటుందన్నారు. ఉత్తర దేశంలో యూరియా, డీఏపీ ధరలు పెంపు జోలికి పోకుండా, దక్షిణ భారతదేశంలో కాంప్లెక్స్ ఎరువులకు ధరలు పెంచారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో లబ్ధి పొందేలా.. ఉత్తర దేశానికి ఒకనీతి, దక్షిణ దేశానికి ఒకనీతి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ తీరుపై మంత్రి హరీశ్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై ఎంత వివక్ష చూపుతుందో.. తెలిసేందుకు కేవలం ఇదో ఉదాహరణ అన్నారు.
ఉత్సవ విగ్రహంలా కిషన్ రెడ్డి.. ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్
తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ఖతం : డీహెచ్ శ్రీనివాస్ రావు