Harish Rao | గజ్వేల్, ఫిబ్రవరి 17: రాష్ర్టానికి మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆమె రాష్ర్టానికి వచ్చిన ప్రతిసారి ఝూటామాటలతో గోబెల్స్ ప్రచారమే చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల మంజూరుపై ఒక్కో కేంద్రమంత్రి ఒక్కోలా మాట్లాడుతూ ప్రజలను తికమక పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అనంతరం సమీకృత మార్కెట్ కార్యాలయంలో మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఇచ్చినది గోరంత, చెప్తున్నది కొండంత అని ఆక్షేపించారు. కేంద్ర ఆర్థిక విధానాల గురించి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇటీవల చెప్పిన విషయాలన్నీ నూటికి నూరు శాతం నిజమని పేర్కొన్నారు. దేశంలోని వాస్తవ పరిస్థితులనే సీఎం ప్రస్తావించారని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలో నడపటం లేదని పక్కా డాటాతోనే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడారని మంత్రి హరీశ్రావు తెలిపారు. ‘సీఎం చెప్పిన ప్రతి మాట కేంద్ర ఇచ్చిన లెక్కలే. నీతి ఆయోగ్ రిపోర్టులు, ఆర్బీఐ లెక్కలు, కాగ్ నివేదికల ఆధారంగానే సీఎం కేసీఆర్ మాట్లాడారు. కానీ నిర్మలా సీతారామన్ గురువారం నిజాన్ని దాటవేస్తూ తెలంగాణపై బురదజల్లారు. వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్తే కేంద్ర మంత్రులకు కడుపు మండుతున్నది. ఆర్థిక వృద్ధిరేటు పెంచాలని, నిరుద్యోగాన్ని తగ్గించాలని, ప్రపంచ దేశాలతో పోటీపడాలని, రైతుల ఆదాయాన్ని పెంచాలని సీఎం కేసీఆర్ సూచించారు. కేంద్రమంత్రులు ఈ వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారు’ అని విమర్శించారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్రమంత్రులు ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
‘పార్లమెంట్లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలంగాణ నుండి తమకు మెడికల్ కళాశాల కోసం ప్రతిపాదనలే రాలేదన్నారు. నిర్మలా సీతారామన్ నిన్న మీడియాతో ఖమ్మం, కరీంనగర్లో మాత్రమే మెడికల్ కళాశాలలు కావాలని రాష్ట్రం కోరిందని చెప్పారు. రాష్ర్టానికి 9 మెడికల్ కాలేజీలిచ్చామని మరో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అంటున్నారు. వీరిలో ఎవరి మాట నిజం? ప్రైవేటు కళాశాలలు ఉన్నచోట ప్రభుత్వ కాలేజీలు ఉండకూడదా? బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రైవేటు కళాశాలలు ఉన్నచోట ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మంజూరు చేశారు కదా? మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వరు?’ అని ప్రశ్నించారు. కుట్రలో భాగంగానే తెలంగాణకు మెడికల్ కళాశాలలు ఇవ్వలేదని ఆరోపించారు.
తెలంగాణపై ప్రేమ ఉంటే రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన రూ.1.25 లక్షల కోట్ల నిధులను నిర్మలా సీతారామన్ వెంటనే విడుదల చేయాలని మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి రూ.38 వేల కోట్లు కోత పెట్టారని ఆరోపించారు. ‘గత బడ్జెట్లో ఎఫ్ఆర్బీఎం నిబంధనల సవరణ పేరిట రూ.15,033 కోట్లు కోత పెట్టింది నిజం కాదా? రైతుల మోటర్లకు విద్యుత్తు మీటర్లు పెట్టలేదని రూ.16,653 కోట్లు రాష్ర్టానికి రాకుండా అన్యాయం చేసింది మీరు కాదా? ఆర్థిక సంఘం 2021 – 26 మధ్య కాలానికిగాను రాష్ర్టానికి రూ.5,374 కోట్లు ఇవ్వాలని చేసిన సిఫారసును తుంగలో తొక్కి అన్యాయం చేసింది నిజం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. స్థానిక సంస్థలకు నిధులు, న్యూట్రిషన్, ప్రత్యేక నిధుల కింద ఆర్థిక సంఘం వివిధ సందర్భాల్లో రూ.216 కోట్లు ఇస్తే, దాంట్లోనూ కేంద్రం అన్యాయం చేసిందని మండిపడ్డారు. రాష్ర్టానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు రూ.2,437 కోట్లు ఇంకా ఎందుకు ఇవ్వటంలేదని ప్రశ్నించారు. ‘విద్యుత్తు బకాయిలు రూ.17,800 కోట్లు ఇవ్వాలని కోరితే ఆంధ్రప్రదేశ్కు ఇచ్చారుగానీ, తెలంగాణకు మాత్రం ఇవ్వలేదు. ఏపీ విభజన చట్టం ప్రకారం మూడేండ్లలో తెలంగాణకు రూ.1,350 కోట్లు రావాలి. ఈ నిధులు ఆంధ్రాకు ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వడంలేదు? తెలంగాణకు రావాల్సిన సీఎస్ఎస్ నిధులు రూ.495 కోట్లు పొరపాటున ఆంధ్రాకు ఇచ్చామని మీరు చెప్పారు. ఆ నిధులు తెలంగాణకు ఎప్పుడు చెల్లిస్తారని ఇప్పటికి పదిసార్లు ఉత్తరం రాసినా సమాధానం లేదు. మిషన్ భగీరథ, మిషన్కాకతీయ ప్రాజెక్టులకు రూ.24,205 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే ఇప్పటివరకూ ఇవ్వలేదు. అవి ఎప్పుడిస్తారో చెప్పండి’ అని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి నిధులు తగ్గించింది నిజం కాదా? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ‘గత ఏడాది కంటే బడ్జెట్లో పత్తి కొనుగోళ్లకు రూ.6,200 కోట్లు కోత పెట్టింది నిజం కాదా? 2014-15 బడ్జెట్లో జీడీపీలో 0.55 శాతం విద్యకు నిధులు కేటాయిస్తే, ఈ సారి బడ్జెట్లో 0.38 శాతానికి తగ్గించింది నిజం కాదా? మాటలేమో కోటలు దాటుతాయి.. చేతలేమో గిట్లా ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో 10.2 శాతం నిధులు విద్యకు కేటాయించింది. గత ఏడాది కంటే విద్యకు, వ్యవసాయానికి నిధులను పెంచాం. కానీ కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతూ, కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నదానికి, చేస్తున్నదానికి పొంతనలేదు. రైతు పక్షపాతిగా చెప్పుకొంటున్న కేంద్రం, తెలంగాణలో ఉపాధి హామీ ద్వారా రైతుల వ్యవసాయభూముల్లో రైతు కల్లాలు కట్టిన నిధులను తిరిగి చెల్లించాలని ఎలా అడుగుతుంది? అని ప్రశ్నించారు.
కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ లోపభూయిష్టమైనదని మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ పథకానికి కేంద్రం రూ.150 కోట్లు కేటాయిస్తే, తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్యశ్రీకి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.800 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. ఆయుష్మాన్ భారత్కన్నా ఆరోగ్యశ్రీ వందరెట్లు గొప్ప పథకమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయటంలేదని సీతారామన్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. కేవలం 26 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ కింద సేవలందిస్తే, ఆరోగ్యశ్రీ ద్వారా 90 లక్షల మందికి సేవలందిస్తున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ కూలీల సంఖ్య ఏటికేడు పెరుగుతుండగా, కేంద్రం మాత్రం పనిదినాలను సగానికి తగ్గించిందని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. డిమాండ్ను బట్టే పనిదినాలు ఇస్తామన్న కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్, బడ్జెట్లో ఈ పథకానికి రూ.30 వేల కోట్లు కోత ఎందుకు పెట్టారో సమాధానం చెప్పకుండా తప్పించుకొన్నారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో విభజన హామీల గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు , రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ గురించి హైదరాబాద్లో మాట్లాడుతారనుకొంటే దాటవేశారని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రభుత్వం పరిమితికి మించిన అప్పులు చేయలేదని, రాష్ట్రం ఒక్క రూపాయి అప్పు తీసుకోవాలన్నా కేంద్ర అనుమతితోనే తీసుకొంటుందని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 293కి లోబడి, సీఏజీ ఆడిట్ ప్రకారమే, కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే రుణాలు తీసుకొన్నదని స్పష్టంచేశారు. ‘కేంద్రప్రభుత్వం చేస్తున్న అప్పుల్ల్లో రోజువారీ రెవెన్యూ ఖర్చులకే 48.7 శాతం పోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న రుణాలతో అద్భుతమైన ప్రాజెక్టులు నిర్మించి భావితరాలకు సంపదను, అద్భుతమైన ఆస్తులను సృష్టించాం.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు కడుతున్నాం. కేంద్రం తీసుకొన్న వంద లక్షల కోట్ల అప్పుల గురించి కేంద్రమంత్రులు ఎందుకు మాట్లాడటంలేదు? బీజేపీ తొమ్మిందేండ్ల పాలనలో వంద లక్ష కోట్లు అప్పుచేసింది. అంటే దాదాపు నెలకు రూ.లక్ష కోట్ల అప్పు చేసినట్టు లెక్క. ఈ అప్పులు ఎందుకు చేశారో కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలి. దేశంలో అతితక్కువ అప్పులు చేసిన రాష్ర్టాల్లో కింది నుండి 6వ స్థానంలో తెలంగాణ ఉన్నదని కేంద్రమే చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం అప్పులు తగ్గించుకొంటూ పోతుంటే, కేంద్రం పెంచుకొంటూ పోతున్నది. మేం చేసిన ఆ కొద్దిపాటి అప్పులు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి రావాల్సిన నిధులు చెల్లించకపోవడం వల్లనే చేయాల్సి వచ్చింది’ అని విమర్శించారు.