హైదరాబాద్ : ఎఫ్సీఐతో బియ్యం కొనకుండా రైసుమిల్లులపై దాడులు చేసి కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకే.. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఏం ముఖం పెట్టుకొని సిద్ధిపేట, గజ్వేల్లో బీజేపీ నేతలు తిరుగుతున్నారంటూ ప్రశ్నించారు. . ఉపాధిహామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని ఇప్పటికే అసెంబ్లీలో మూడుసార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, ఆ పని చేసుకొచ్చి ముఖం చూపిస్తే బాగుంటుందని ఆ పార్టీ నేతలకు చురకలంటించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఒంటేరు ప్రతాపరెడ్డి హాజరయ్యారు.
గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా తెలంగాణ విద్యార్థి, ఉద్యమ నాయకుడైన మాదాసు శ్రీనివాస్తో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం మాదాసు శ్రీనివాస్దని, సీఎం కేసీఆర్ కూడా మాదాసు శ్రీనివాస్కు పదవి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. 2001 నుంచి ఇప్పటి వరకూ అటు ఉద్యమంలో, ఇటు పార్టీలో కష్టపడి పని చేసే వ్యక్తి శ్రీనివాస్ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్రం, బీజేపీపై విమర్శలు గుప్పించారు.
బాయిలకాడ మోటారు పెడితే రూ.25వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆశ చూపిందని, సీఎం కేసీఆర్ మాత్రం మోటార్లు పెట్టేది లేదని స్పష్టం చేశారని హరీశ్రావు తెలిపారు. ఎఫ్సీఐతో బియ్యం కొనకుండా రైసుమిల్లులపై దాడులు చేసి కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓర్వలేక తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఎఫ్ఆర్బీఎం నిధులను కావాలనే బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది, కేంద్రం ఇవ్వాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయకుండా ప్రజలను బీజేపీ ఇబ్బంది పెడితే.. తెలంగాణ సమాజం తిరగబడుతుందని కేంద్రాన్ని మంత్రి హరీశ్ హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని పార్టీ బీజేపీ అన్నారు. వరంగల్కు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్కు తీసుకెళ్లిందని ఆరోపించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో.. కేంద్ర బీజేపీ చెప్పాలని మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఖాళీగా లేకుండా అన్నీ భర్తీ చేస్తామని చెప్పినట్టుగానే.. సీఎం కేసీఆర్ ఉద్యోగ నియామకాలు భర్తీ ప్రారంభించారని మంత్రి చెప్పారు. వందలాది దరఖాస్తులు పెట్టుకున్నా మెడికల్ కళాశాలలు, నవోదయ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రానికి మంజూరు కాకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్నదని ధ్వజమెత్తారు.