తెలంగాణ ఏర్పడినప్పటినుంచే రాష్ర్టాన్ని కించపరుస్తూ మోదీ మాట్లాడారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నారు. నల్లగొండ, మునుగోడు మీద సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమ, బీజేపీ నేతలకు, మోదీకి ఎందుకు ఉంటుంది? ఫ్లోరోసిస్ను మునుగోడు నుంచి తరిమింది కేసీఆర్ కాదా?
ముసలివాళ్లు ఈసారి బీజేపీకి ఓటెయ్యండి.. ప్రధానమంత్రిని ఒప్పించి ఆసరా పింఛన్ను రూ.3 వేలు చేయిస్తా.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలోబీజేపీ అభ్యర్థి ఇస్తున్న హామీ ఇది. గతంలో దుబ్బాకలో రఘునందన్రావు పోటీ చేసినప్పుడూ ఇదే హామీ ఇచ్చారు.
మొన్నటికి మొన్న హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంలోనూ సేమ్ సీన్ రిపీట్.. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే బండికి బండి.. ఇల్లుకు ఇల్లు.. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అన్న బండి హామీలు ఇప్పటికీ ఫేమస్సే..
ఈ గోల్మాల్ బీజేపీ నేతల అధినేత మోదీ స్వరాష్ట్రం.. గుజరాత్లో ఇస్తున్న వృద్ధాప్య పింఛన్ రూ.750.. వీళ్లు పాలిస్తున్న కర్ణాటకలో అయితే రూ.600 ఇచ్చుడే గగనమైంది. కేంద్ర ప్రభుత్వం తానుగా ఇస్తున్న పింఛనే రూ.200.
వీళ్లు మునుగోడులో గెలిస్తే రూ.3 వేలు పింఛన్ ఇస్తారంట! ఒక్క మునుగోడు వరకు మాత్రం పింఛన్ 3 వేలు ఎలా ఇవ్వగలరు?
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు బీజేపీ నేతలకు వేసిన సూటి ప్రశ్న ఇది.
బీజేపీ నేతలు ఇచ్చే జవాబేమిటి?
వీళ్ల జవాబు కోసం మునుగోడు ప్రజలు.. తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్నది.
హైదరాబాద్, అక్టోబరు 16 (నమస్తే తెలంగాణ): మునుగోడులో బీజేపీ మోసపూరితమైన హామీలను గుప్పిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ అంటేనే మోసం.. దగా (ఝూటా, జుమ్లా)కు ప్రతిరూపమని మండిపడ్డారు. మునుగోడులో తాము గెలిస్తే రూ.3 వేల పింఛన్ ఇస్తామని చెప్తున్న బీజేపీ నేతలు ఆ హామీని తెలంగాణ వ్యాప్తంగా అమలుచేస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాలతో చెప్పించాలని.. లేకుంటే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలు అయిందా? అని నిలదీశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిది ఆత్మగౌరవ పోరాటం కాదని, ఆస్తులు పెంచుకొనే ఆరాటమని చెప్పారు. టీఆర్ఎస్ ఎనిమిదేండ్ల పాలనలో సఫలం, సంక్షేమం, సామరస్యం ఉంటే.. బీజేపీ పాలన అంతా విఫలం, విషం, విద్వేషంగా కొనసాగుతున్నదన్నారు. తెలంగాణకు అన్ని విధాలుగా అన్యాయం చేసిన బీజేపీకి మునుగోడులో ఓటు అడిగే హక్కు లేదని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. నల్ల చట్టాలను రద్దుచేస్తూ.. మద్దతు ధరకు చట్టబద్ధత తెస్తామని జాతికి ప్రధాని హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ నెరవేరలేదని గుర్తుచేశారు. ప్రధాని మాటలకే దిక్కులేకుంటే.. మునుగోడులో బీజేపీ నేతలు ఇచ్చే మాటలకు విలువ ఏమిటని హరీశ్రావు నిలదీశారు.
మోదీతో చెప్పించండి
దుబ్బాక, హుజూరాబాద్లో గెలిస్తే రూ.3 వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు మునుగోడులోనూ అవే ఝూటా, జుమ్లా మాటలు చెప్తున్నారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. బీజేపీ అంటేనే మోసానికి ప్రతీక అన్నారు. 2018లో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆసరా కింద రూ.2,016 పింఛన్ ఇస్తామని చెప్పి అమలుచేశామని.. దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రూ.3 వేల పింఛన్ అమలుచేసి ఇక్కడ మాట్లాడాలని సవాలు చేశారు.
దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేని విధంగా బీడీ కార్మికులు, నేతన్నలు, డయాలిసిస్ రోగులకు పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పునరుద్ఘాటించారు. గుజరాత్లో రూ.750, మహారాష్ట్రలో రూ.వెయ్యి, కర్ణాటకలో రూ.600 చొప్పున పింఛన్ ఇస్తున్నారని.. మునుగోడులో గెలిస్తే.. ఒక్క మునుగోడులో మాత్రం రూ.3 వేలు పింఛన్ ఇస్తారా? అని ఎద్దేవాచేశారు. మోదీతో మాట్లాడి అయినా రాజగోపాల్రెడ్డి రూ.3 వేల పింఛన్ ఇప్పిస్తారంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు. కన్నతల్లికి అన్నం పెట్టనివాడు, పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానని బొంకినట్టు బీజేపీ నాయకుల వ్యవహారం ఉన్నదని హరీశ్రావు మండిపడ్డారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి పోతే బండి, ఇల్లు పోతే ఇల్లు, గుండు పోతే గుండు ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికలు అయిపోయాక బండి లేదు.. గుండు లేదు అని అన్నారు. నిజామాబాద్లో గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్న అర్వింద్ దాన్ని తేలేదని, దుబ్బాకలో ఎడ్లు నాగలి ఇప్పిస్తాన్న రఘునందన్.. ఆ ఊసే ఎత్తడం లేదని తెలిపారు. నాడు రఘునందన్ రూ.3 వేలు పింఛన్ అన్నారని, బండి సంజయ్ బండి ఇస్తానని ఇవ్వలేదని, ఇప్పుడు రాజగోపాల్రెడ్డి రూ.3 వేల పింఛన్ అంటూ ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రమంతా రూ.3 వేల పింఛన్ ఇస్తామని మోదీ అమిత్షాలతో చెప్పించాలని, లేకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీలో చేరగానే రాజగోపాల్రెడ్డికి అబద్ధాలు బాగా వంటబట్టాయని ఎద్దేవా చేశారు. మునుగోడు ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని కోరారు.
ఫోరైడ్కు పరిష్కారం
గతంలో మునుగోడులో ఫ్లోరైడ్ లేని తాగునీటిని సరఫరా చేయకపోతే.. ఆ ప్రాంతం నో మ్యాన్ జోన్గా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన విషయాన్ని మంత్రి హరీశ్రావు ప్రస్తావించారు. ఈ క్రమంలోనే మిషన్ భగీరథ, కాకతీయకు నిధుల సాయం చేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు.
కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంత్రులుగా, కీలక నేతలుగా వ్యవహరించిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్లోరైడ్ సమస్యను ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాతే.. మిషన్ భగీరథతో ఫోరైడ్ సమస్యను టీఆర్ఎస్ ప్రభుత్వమే పరిష్కరించిందని చెప్పారు. నల్లగొండకు నీళ్లే ఇవ్వలేని బీజేపీకి మునుగోడులో ఓటు అడిగే హక్కున్నదా అని ప్రశ్నించారు. ఎనిమిదేండ్ల తరువాత కూడా కృష్ణాజలాల్లో వాటా తేల్చకపోవడంతో నల్లగొండ, మునుగోడుకు తీవ్ర నష్టం జరుగుతున్నదని తెలిపారు. కోర్టులో కేసు ఉపసంహరించుకోగానే వాటా తేలుస్తామని చెప్పిన బీజేపీ పెద్దలు పది నెలలు కావస్తున్నా ఇంతవరకూ ఏమీ చేయలేదని మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పడినప్పటినుంచే రాష్ర్టాన్ని కించపరుస్తూ మోదీ మాట్లాడారని.. తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ అన్న విషయాన్ని గుర్తుచేశారు. నల్లగొండ, మునుగోడు మీద తెలంగాణ సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమ, బీజేపీ నేతలకు, మోదీకి ఎందుకు ఉంటుంది? ఫ్లోరోసిస్ను మునుగోడు నుంచి పారదోలింది కేసీఆర్ కాదా? దేశంలో 157 వైద్య కళాశాలలు ఇస్తే ఒక్క కాలేజీనైనా తెలంగాణకు ఇచ్చారా? అని ప్రశ్నలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేట, నల్లగొండకు వైద్య కళాశాలలు ఇచ్చిందని గుర్తు చేశారు. రావి నారాయణరెడ్డి, ధర్మభిక్షం లాంటి గొప్ప నాయకులు ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ లాంటి జిల్లాలో బీజేపీ ఆటలు సాగవని స్పష్టంచేశారు.
ఆస్తులు పెంచుకొనే ఆరాటం
‘రాజగోపాల్ రెడ్డి అహంకారం గెలవాలో? మునుగోడు ప్రజల ఆత్మగౌరవం గెలవాలో ఆలోచించాలి’ అని హరీశ్రావు పిలుపునిచ్చా రు. ‘అసలు మునుగోడుకు రాజగోపాల్రెడ్డి ఉపఎన్నిక ఎందుకు తెచ్చారు? రాజీనామా దేనికోసం చేశారు? ప్రజల మీద ప్రేమతోనా? బీజే పీ ఇచ్చే కాంట్రాక్టులు.. డబ్బుల కోసమా? అని నిలదీశారు. రాజగోపాల్రెడ్డిది ఆత్మగౌరవ పోరా టం కాదని, ఆస్తులు పెంచుకొనే ఆరాటమని తేల్చి చెప్పారు. బీజేపీ చెప్పే అబద్ధాలు మునుగోడులో నడువవని అన్నారు. గతంలో బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు, వాస్తవాల వీడియోలను ప్రతి ఇంటింటికీ చేరుస్తామని చెప్పారు.
రాజగోపాల్రెడ్డి స్వార్థం కోసం ఉప ఎన్నిక తెచ్చారని తెలిపారు. ‘రాజగోపాల్రెడ్డి గెలిస్తే ఒకే ఒక్క వ్యక్తికి మేలు జరుగుతుంది. ప్రభాకర్రెడ్డి గెలిస్తే మునుగోడు ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది. నియోజకవర్గానికి న్యా యం జరుగుతుంది. ప్రభాకర్రెడ్డి గెలుపు.. మునుగోడు అభివృద్ధికి మలుపు’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రపంచంలోనే దేశం పరువు పోయే విధంగా బీజేపీ పాలన ఉన్నదని, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మన స్థానం 107కి దిగజారిందని, ఇందుకే బీజేపీకి ఓటు వేయా లా? అని ప్రశ్నించారు. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లా దేశ్ కన్నా దేశంలో అధ్వాన్నంగా పరిస్థితులు దిగజారాయని ఆవేదన వ్యక్తంచేశారు.
టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు లాభం…
మునుగోడులో రాజగోపాల్రెడ్డి గెలిస్తే ఆయనకు మాత్రమే లాభమని, కానీ.. టీఆర్ఎస్ గెలిస్తే మొత్తం నియోజకవర్గానికి లాభమని హరీశ్రావు చెప్పారు. తెలంగాణ ఏర్పడక ముందు నల్లగొండ జిల్లాలో 4 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఇప్పుడు 40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ఇంత పంట ఉత్పత్తి పెరగడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీరు, ఉచిత విద్యుత్తు సరఫరా చేయడమే కారణమన్నారు.
నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ఐదు లక్షల వ్యవసాయ మోటర్లు ఉన్నాయని, రాష్ట్రంలో రైతుబంధు లబ్ధిదారులు అత్యధికంగా ఉన్నది మునుగోడులోనే అని చెప్పారు. ఉచిత విద్యుత్తు ద్వారా ఈ రైతులందరూ లబ్ధి పొందుతున్నారని అన్నారు. జిల్లాలో బత్తాయి, నిమ్మ మార్కెట్ను ఏర్పాటు చేశామని, నల్లగొండ జిల్లాలో యాదాద్రి పవర్ ప్లాంటును ఏర్పాటు చేశామని వివరించారు. ప్రభుత్వ నిధులతో దేశం ఆశ్చర్యపోయేలా యాదాద్రి దేవాలయాన్ని నిర్మించామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం నల్లగొండ జిల్లాకే దక్కిందని గుర్తుచేశారు. ఎస్ఆర్ఎస్పీ రెండో దశ ద్వారా చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందించామని పేర్కొన్నారు.
వారెందుకు వస్తున్నారు?
నాగార్జునసాగర్, హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలవడంతో అకడ అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని మంత్రి హరీశ్రావు తెలిపారు. దుబ్బాక, హుజూరాబాద్లో బీజేపీ కేంద్ర మంత్రులు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. బీజేపీని నమ్మడానికి మునుగోడు ప్రజలు అమాయకులు కారని గుర్తుంచుకోవాలని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల ప్రచారం గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు.. మునుగోడుకు అమిత్ షా ఎందుకు వచ్చారో చెప్పాలని.. రోజుకో కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ నాయకులు ఎందుకు వస్తున్నారంటూ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
హరీశ్రావు సంధించిన ప్రశ్నలు
ఝూటా ఔర్ జుమ్లా
పెంచింది.. దించింది
ధరలు పెంచింది… నడ్డి విరిచింది
గ్యాస్ ధరలు పెంచింది
నిరుద్యోగం పెంచింది
ఆకలి పెంచింది
పెట్రోలు, డీజిల్ ధరలు పెంచింది
జీడీపీని దించింది
రూపాయిని దించింది
మోసం.. దగా…
సందర్భం: 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో
ధర్మపురి అరవింద్, అప్పటి బీజేపీ తరఫు అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ
ఏం చెప్పిండు: ఎన్నికలైన తరువాత ప్రభుత్వం ఏర్పడ్డ 5 రోజుల లోపలే పసుపు బోర్డు పెట్టి తీరుతాం.
ఇప్పుడేమంటున్నాడు: ఏహే.. నేను5రోజులల్ల తెస్తానని చెప్పలేదు. ప్రయత్నిస్తనని చెప్పిన. అయినా.. ఎక్స్టెన్షన్ సెంటర్ తీసుకొచ్చిన గదా.
సందర్భం: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఏం చెప్పిండు: జీహెచ్ఎంసీ పరిధిలో వరదల్లో ఎవరిదైనా బండి పోతే బండి.. కారు పోతే కారు.. బైక్ పోతే బైక్ కొనిస్తాం.. ఫర్నిచర్ పోతే ఫర్నిచర్ కొనిస్తాం. ప్రజలు ఏం నష్టపోయినా ఇచ్చే బాధ్యత మాది. కేంద్రంలో బీజేపీ ఉన్నది. ఇప్పిస్తాం
ఇప్పుడేమంటున్నాడు: మేం ఎన్నికల్లో ఇస్తామని చెప్పినం. ఆస్తులకు సంబంధించినవారికి ఇన్సూరెన్స్ (బీమా) ఉంటుంది కదా. ఇన్సూరెన్స్ క్లెయిం చేసుకోవాలి. వాళ్లకు ఇన్సూరెన్స్ తప్పకుండా ఉంటుంది.
సందర్భం: దుబ్బాక శాసనసభ ఉప ఎన్నిక రఘునందన్రావు, బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే
ఏం చెప్పిండు: దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని ప్రతి రైతుకు ఒక నాగలి, రెండు ఎడ్లను బీజేపీ తరఫున ఇస్తాం. నియోజకవర్గంలోని 5 వేల కుటుంబాలు స్థిర నిర్ణయం తీసుకొని, దుబ్బాకకు టెక్స్టైల్ పార్కురావాలని కోరుకొని బీజేపీకి ఓటెయ్యాలి. మీరు నన్ను గెలిపిస్తే ఇక్కడ ఎన్నికలయిన తర్వాత 6 నెలల్లోపే కేంద్ర మంత్రిని తీసుకొని వచ్చి టెక్స్టైల్ పార్క్ను మంజూరు చేయిస్తా.
ఇప్పుడేమంటున్నాడు: నేను కేంద్ర నిధులను తీసుకువచ్చి దుబ్బాకను డెవలప్చేస్తా అని నా ఎన్నికల ప్రచారంలో ఎక్కడా చెప్పలేదు.
సందర్భం: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈటల రాజేందర్, బీజేపీ అభ్యర్థి
ఏం చెప్పిండు: 60 ఏండ్లు పైబడిన చిన్న, సన్నకారు రైతులకునెలకు రూ.3వేల పింఛన్ ఇప్పిస్తా.
ఇప్పుడేమంటున్నాడు: అసలు ఆ ఊసే ఎత్తడం లేదు.
సందర్భం: మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి
ఏం చెప్తున్నడు: ముసలివాళ్లు ఈసారి బీజేపీకి ఓటెయ్యాలి. బీజేపీకి ఓటేస్తే ప్రధానమంత్రిని ఒప్పించి ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛను ఇప్పుడున్న రెండువేల రూపాయలను మూడువేలు చేయిస్త.