సిద్దిపేట : తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న బీజేపీపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న బీజేపీ ఫేక్ సోషల్ మీడియాను ఎండగట్టాలి, నిలదీయాలని మంత్రి సూచించారు. సిద్దిపేటలో టీఆర్ఎస్వీ నాయకులతో మంత్రి హరీశ్రావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నూతన విద్యార్థులకు స్వాగతం పలికే వాల్పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. పార్టీలో పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యువకుల, విద్యార్థుల పాత్ర గొప్పదన్నారు. అదే పంథాలో పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని, ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందని సూచించారు. ఆరోగ్య తెలంగాణలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో 70 ఏండ్లలో 4 మెడికల్ కాలేజీలు ఉంటే తెలంగాణలో ఏడేండ్లలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఒక వైపు వైద్య విద్యా.. మరో వైపు ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని హరీశ్రావు చెప్పారు.
సబ్బండ వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంటే .. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను బీజేపీ సంక్షోభంలో పడేసిందని మంత్రి మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ సారథులు విద్యార్థులే అని పేర్కొన్నారు. బీజేపీ చేస్తున్న అసత్యపు ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దేశ పురోగతిలో రుపాయ్ విలువ, సిపాయి విలువ తగ్గిందన్నారు. ఎనిమిదేండ్లలో దేశానికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. మత కల్లోలాలు, హింస తప్ప గుణాత్మక మార్పు లేదన్నారు. బీజేపీ అంటే అబద్ధాల పార్టీ అని మంత్రి హరీశ్రావు ఎద్దెవా చేశారు.