రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. గొంతు పెద్దదిగా చేసుకొని, ఒక అబద్ధాన్ని వందసార్లు చెబుతోందని, అబద్ధాలను కూడా నిజమని నమ్మేలా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఫేక్ వాట్సప్ యూనివర్సిటీ ల ద్వారా ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజలను భాజపా మభ్యపెట్టి, లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట నియోజకవర్గం స్థాయి టి ఆర్ ఎస్ విద్యార్తి విభాగం ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
నీతి ఆయోగ్ కూడ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ అనేక అంశాల్లో దేశంలోనే ముందుందని, విద్యుత్ తలసరి వినియోగం లో తెలంగాణ దేశంలోనే నెం.1 గా నిలించిందన్నారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే రాష్ట్రంలో దేశంలోనే టాప్ రాష్ట్రాల లో తెలంగాణ నెం.3 స్థానంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఇన్ని రంగాల్లో ముందంజలో ఉంటే ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న, సీఎం యోగి పాలిస్తున్న యూపీ మాత్రం 28 వ స్థానంలో ఉందని, దేశంలోనే ఆఖరు స్థానంలో ఉందని హరీశ్ ఎద్దేవా చేశారు. టీఆర్ ఎస్ పాలనకు, బీజేపీ పాలనకు ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు.
317 జీవోను బండి సంజయ్ విమర్శించడం అంటే వారి బిజేపి పాలిత కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడమే అవుతుందని, ప్రధాన మంత్రిని, రాష్ట్ర పతిని కూడా తప్పు పట్టినట్టేనని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. 317 GO తో 85 శాతం ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, అందరూ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ కే వస్తానంటే, ఆ జిల్లా ల ఉద్యోగుల కు నష్టం చేసినట్టు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. బండి సంజయ్ దీనికి నేరుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జనాభాతో పోలిస్తే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న రాష్ట్రం తెలంగాణే అని, బిజేపి పాలిత కర్ణాటక రాష్ట్రంలో ఆ రాష్ట్రం మొత్తం జనాభాతో పోల్చుకుంటే ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్య 1.2 శాతం మాత్రమే అని వివరించారు.
30 ఎండ్ల నుంచి బిజేపి పాలిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో ఆ రాష్ట్రం మొత్తం జనాభాలో ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్య 1.1 శాతం మాత్రమే అని తెలిపారు. బిజేపి భాగస్వామ్య బీహార్ రాష్ట్రంలో ఆ రాష్ట్రం మొత్తం జనాభాలో ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్య 0.3 శాతం మాత్రమే అని హరీశ్ లెక్కలతో సహా వివరించారు. ఇక మహారాష్ట్ర లో ఆ రాష్ట్రం మొత్తం జనాభాలో ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్య 1.3 శాతం మాత్రమేనని, కానీ తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభాలో ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్య అత్యధికంగా 3 శాతం అని హరీశ్ చెప్పుకొచ్చారు. దేశంలోనే అత్యధిక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ఉద్యోగుల విషయంలో అవగాహన లేకే బీజేపీ అసంబద్ధ ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.
317 జీవో రద్దు అంటే నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడమే అవుతుందని హరీశ్ అన్నారు. 317 జీవో ద్వారా అన్ని జిల్లాకు న్యాయం జరుగుతుంది. అన్ని జిల్లాల లో ఖాళీలు ఉంటాయని, 317 జీవో ద్వారా అన్ని జిల్లా లలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. 317 జీవో ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న దే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యం అని వివరించారు. అసలు ఓ పద్ధతీ పాడు లేకుండా చేస్తే ఉద్యోగ సంఘాలు ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కలిపి 15 లక్షల 62 వేల 9 వందల 12 ఉద్యోగాలు ఖాళీ గా ఉన్నాయని, ముందుగా మోడీ గారినీ, కేంద్ర ప్రభుత్వం ను ఆ ఖాళీ పోస్టులు నింపమని భాజపా నాయకులు డిమాండ్ చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. దొంగే దొంగ అన్న చందంగా భాజపా తీరు తయారైందని మంత్రి హరీశ్ దెప్పి పొడిచారు.