సిద్దిపేట : రాష్ర్ట ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలుస్తూ.. చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. మొబైల్ ఫిష్ రిటేట్ ఔట్ లెట్ వెహికిల్స్.. మత్స్యకారులకు బాసటగా నిలుస్తాయని, దీంతో మత్స్యకారులకు ఆర్థిక పుష్టి, ప్రజలకు ఆరోగ్య పుష్టి కలుగుతుందన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని మంత్రి నివాసం వద్ద సోమవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో మొబైల్ ఫిష్ ఔట్ లెట్ – సంచార వాహనాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సిద్దిపేట సొసైటీ లబ్ధిదారు మహిళా మత్స్య పారిశ్రామిక సంఘ సభ్యులు కాముని భాగ్యమ్మ, తదితరులకు వాహనాలను అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో చేపల సంచార వాహనాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా సంచార చేపల విక్రయ వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని మంత్రి కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్య శాఖకు రూ.10 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ ఉండేదని.. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రస్తుతం రూ.100 కోట్ల బడ్జెట్ ను కేటాయించామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మత్స్యకారుడు ఖాళీగా ఉండకుండా ఉపాధి కల్పిస్తున్నామని, మొబైల్ వెహికిల్స్ ద్వారా నాణ్యమైన చేపలను అందిస్తామని, ముఖ్యంగా మహిళలకు కూడా ఈ వాహనాలను అందజేస్తే ఎంతో ఉపయోగకరమని మంత్రి హరీశ్ వెల్లడించారు. మహిళ సంఘ సభ్యులు చేపలు విక్రయాలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు, మత్స్యశాఖ కింద రూ. 10 లక్షల యూనిట్ లో రూ. 6 లక్షలు ప్రభుత్వమే సబ్సిడీ అందిస్తున్నదని, మిగతా రూ. 4 లక్షలు లబ్ధిదారు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
మొబైల్ ఫిష్ రిటేల్ ఔట్ లెట్ వాహనంలో ఓవెన్, వెయింగ్ మిషన్, ప్యాబ్రికేట్ చేసిన గ్యాస్ స్టవ్, ట్రేలు.. ఇలా పూర్తిస్థాయిలో ఆధునిక పద్ధతిలో సామాగ్రి సమకూర్చినట్లు మంత్రి వివరించారు. మ్మహిళా మత్స్య పారిశ్రామిక సంఘ సభ్యులకు హైదరాబాదులో సంచార వాహన విక్రయాలపై శిక్షణ ఇప్పించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి మధుసూదన్ ను మంత్రి ఆదేశించారు. సిద్ధిపేట సొసైటీకి మరో రెండు యూనిట్లు ఉన్నాయని అవసరమైన మత్స్యకార ఔత్సాహికులు ముందుకు రావాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.