యాదాద్రి భువనగిరి, మే 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/బీబీనగర్: ‘కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఒక్క ఎయిమ్స్ మాత్రమే. దాన్నీ గాలికి వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం అప్పజెప్పి మూడేండ్లు అవుతున్నా తట్టెడు మట్టి తియ్యలేదు. బీజేపీ వారికి మాటలు ఎక్కువ. చేతలు తక్కువ. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డికి బాధ్యత లేదా?’ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత బీబీనగర్ ఎయిమ్స్ దవాఖానను సందర్శించారు. ఆ తర్వాత భువనగిరి జిల్లా దవాఖానలో టీ-డయాగ్నస్టిక్ సెంటర్, దవాఖాన ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. నవజాత శిశు స్థిరీకరణ యూనిట్, ఇంటెన్సివ్ పీడియాట్రిక్ కేర్ యూనిట్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఎయిమ్స్కు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడిన కిషన్రెడ్డి.. తాము కాగితాలతో సహా రుజువులు చూపిస్తే నాలుక కర్చుకొన్నాడని ఎద్దేవా చేశారు. గత పాలకులు 70 ఏండ్లలో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేస్తే.. సీఎం కేసీఆర్ ఏడేండ్లలోనే 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలను మంజూరుచేశారని వివరించారు.
మన పిల్లలు డాక్టర్లు కావాలి, వైద్య విద్య అందుబాటులోకి రావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. ఎయిమ్స్తో పాటు మంజూరైన నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా సేవలు అందిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో నిమ్స్ ఆధ్వర్యంలో అందించిన ఓపీ సేవలే ఇప్పటికీ ఎయిమ్స్లో అందుతున్నాయని, కేంద్రం కొత్తగా అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు.
ఇన్నేండ్లలో ఒక్క థియేటర్, బ్లడ్బ్యాంక్ నెలకొల్పలేదని, ఒక్క ఆపరేషన్, ఒక్క డెలివరీ కూడా చేయలేదని విమర్శించారు. డాక్టర్ పోస్టులు సగానికి పైగా ఖాళీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.185 ప్రొఫెసర్ల పోస్టులకు 95 మందిని, 812 నర్సు పోస్టులకు 200 మాత్రమే నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 పడకల దవాఖానలో ఒక్క పేషెంట్ కూడా లేకపోతే 212 మంది వైద్య విద్యార్థులు ఎలా ప్రాక్టీస్ చేస్తారని కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం నిర్లక్ష్యం చేసినా ఎంబీబీఎస్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారు భువనగిరి జిల్లా దవాఖానలో ప్రాక్టీసు చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు.
ఎయిమ్స్ను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి విజ్ఞప్తి మేరకు భువనగిరి మున్సిపాలిటీకి మూడు బస్తీ దవాఖానలు, భువనగిరి అర్బన్ దవాఖాన ఆధునికీకరణకు రూ.కోటి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్గుప్తా తదితరులు పాల్గొన్నారు.