సంగారెడ్డి: జహీరాబాద్లో రూ.97 కోట్లతో నిర్మిస్తున్న అభివృద్ధి పనుల పైలాన్ని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
‘పక్కన ఉన్న కర్ణాటకలో బీజేపీ సర్కార్ ఉంది. బీజేపీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్. మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు కర్ణాటకలో ఎక్కడ ఉన్నాయి. నియ్యత్ ఉంటే బర్కత్ ఉంటది.. బీఆర్ఎస్ సర్కార్ చేసిన సాయాన్ని మీరంతా గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో బీజేపీ పార్టీ ఉన్నది. ఏం ఇచ్చింది. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన్రు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను అర్దాంతరంగా తీసేసిర్రు. అన్నిటినీ ప్రయివేట్ పరం చేస్తున్నరు. సంగారెడ్డిలో ఉన్న ఓడీఎఫ్ ఫ్యాక్టరీ భూముల్ని కేంద్రం అమ్ముతుంది. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టేది బీజేపీ అయితే … ఉద్యోగాలు ఇచ్చేది బీఆర్ఎస్ పార్టీ. పన్నులు పెంచేది బీజేపీ అయితే.. పనులు చేసుడు బీఆర్ఎస్ పార్టీ పని’ అని అన్నారు.
రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు భారీగా పెరిగాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. వైద్య సీట్లలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి చేరిందని, రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లకు కటాఫ్ మార్కులు భారీగా తగ్గాయని తెలిపారు. 8.78లక్షల నీట్ ర్యాంకుకు రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అన్నారు. కొత్తగా 8 వైద్య కళాశాలలతో మరో 1,150 సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. బి-కేటగిరీలో 80శాతం స్థానిక రిజర్వేషన్లతో ప్రయోజనం ఉంటుందని, రిజర్వేషన్లు పెరగడంతో ఎస్టీ విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయని అన్నారు. జనాభా ప్రాతిపదికన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణకు తెలిస్థానం, వైద్య విద్య పీజీ సీట్లలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని మంత్రి వివరించారు.