Minister Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): దాసోజు శ్రవణ్ , కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తిరస్కరించడాన్ని మంత్రి తన్నీరు హరీశ్రావు తప్పుపట్టారు. అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన శ్రవణ్, సత్యనారాయణ దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వారు తమ తమ రంగాల్లో ప్రజలకు మేలుచేసే అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తే.. వారిద్దరు బీఆర్ఎస్ పార్టీలో సభ్యులుగా ఉండటం వల్ల అనర్హులనడం దారుణమని అన్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. సరారియా కమిషన్ ప్రతిపాదనలను బట్టి చూస్తే గవర్నర్ పదవిలో తమిళిసై ఉండకూడదన్నారు. బీజేపీకి చెందిన గులాం అలీ ఖతానాను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపలేదా?
బీజేపీ నేత మహేశ్ జఠ్మలానీ, సోనాల్ మాన్సింగ్, రాంషఖల్, రాకేశ్ సిన్హా.. వీళ్లంతా బీజేపీలో పనిచేయలేదా? మరి వీరిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఎలా నియమించారని ప్రశ్నించారు. యూపీలో జితిన్ ప్రసాద్, గోపాల్ అర్జున్బూర్జీ, దరీ వీరేంద్రసింగ్, రజనీకాంత్ మహేశ్వరీ, సాకేత్ మిశ్రా.. హన్స్రాజ్ విశ్వకర్మ.. ఇలా అనేక మందిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారని గుర్తు చేశారు. వీరంతా బీజేపీలో ప్రత్యక్షంగా ఉన్నవారే కదా? అంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక విధానం.. బీజేపీతో కలిసిలేని రాష్ట్రాల్లో మరో విధానం అమలు చేస్తారా? అని ధ్వజమెత్తారు. నిజంగా ప్రభు త్వం తప్పు చేస్తే గవర్నర్ సరిచేస్తే ఏమో అనుకోవచ్చని, కానీ.. నీతి, నిజాయితీతో పనిచేస్తే కూడా గవర్నర్ కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేసిన బిల్లులను ఆపారని, రెండేసిసార్లు పంపినా వాటిని ఆమోదించలేదని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారని హరీశ్ రావు పేర్కొన్నారు.