హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. కేంద్రం నిధులు ఆపడం వల్లే టీచర్ల జీతాల చెల్లింపులో ఆలస్యం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రమోషన్లు, బదిలీల విషయంలో కేసీఆర్ పాజిటివ్గా ఉన్నారు. ఆ సమస్యలను కూడా పరిష్కారిస్తామన్నారు. విద్యాశాఖలోని ఖాళీలన్నింటిని త్వరలోనే భర్తీ చేస్తాం అని హరీశ్రావు స్పష్టం చేశారు.
హైదరాబాద్ వనస్థలిపురంలో నిర్వహించిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) సమావేశంలో మంత్రి హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో మొట్టమొదటి ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ. ఉపాధ్యాయుల హక్కుల కోసమే కాకుండా సమాజం కోసం, విద్యార్థుల కోసం పోరాటం చేసిన సంస్థ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం. ఈ సంఘం ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్లాలి. ఉన్నత విద్యాబోధన కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.
ఒకటో తేదీన జీతాలు వస్తుండే.. ఇప్పుడేమో పదో తారీఖుకు జీతాలు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారని ఉపాధ్యాయులను ఉద్దేశించి హరీశ్రావు వ్యాఖ్యానించారు. జీతాల గురించి మీకు కూడా ఆందోళన ఉంది. డబ్బులు ఉండి మీకు ఇవ్వకుండ ఉంటామా? కావాలని ఆపుతామా? మొదటి ఆరేడు ఏండ్లు ఎప్పుడు కూడా జీతాలు ఆగలేదు. ఏడాది కాలం నుంచి ఈ సమస్య వస్తుంది. ఇది మీకు కూడా తెలిసి ఉంటే మంచిది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతుంది. ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు. అసెంబ్లీలో రెండున్నర లక్షల కోట్లకు బడ్జెట్ పాస్ అయింది. బడ్జెట్ పాసైన తర్వాత ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లు ఎఫ్ఆర్బీఎం నిధులలో కోత పెట్టేసింది. బోరు బావుల వద్ద మీటర్లు పెట్టడం లేదని రూ. 12 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి రాకుండా నిలిపివేశారు. 15వ ఆర్థిక సంఘం చెప్పిన రూ. 5 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. మన రాష్ట్రానికి హక్కుగా, వాటాగా రావాల్సిన రూ. 40 వేల కోట్లను కేంద్రం నిలిపివేసింది. దీంతో కొంత ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. దేశంలో అతి ఎక్కువ వేతనాలు పొందుతున్న ఉద్యోగులు ఎవరంటే అది తెలంగాణ ఉపాధ్యాయులే. వీలైనంత త్వరగా జీతాల సమస్యను పరిష్కరిస్తాం అని హరీశ్రావు స్పష్టం చేశారు.
గురువు లేనిదే విద్య లేదు. విద్య లేనిదే జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోతే ఈ లోకంలో మనుగడ ఉండనే ఉండదు అని హరీశ్రావు పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ప్రతి మనిషి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురుకు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. మార్కులు, ర్యాంకులే కాకుండా.. ఉన్నత విలువలు నేర్పించేలా విద్యా బోధన కొసాగాల్సిన అవసరం ఉంది. మంచి విద్యతో పాటు విలువలు, బాధ్యత కలిగిన విద్యార్థులను సమాజానికి అందించాలి. మార్కులు, ర్యాంకులు కూడా ముఖ్యమే. అయినప్పటికీ విలువలతో కూడిన భావి భారత పౌరులను సమాజానికి అందించడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. దీని కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది అని మంత్రి పేర్కొన్నారు.
కేంద్రం మోడల్ స్కూల్స్ను రద్దు చేసింది. అయినా మనం కొనసాగించాం అని హరీశ్రావు తెలిపారు. అంగన్వాడీల బడ్జెట్ను తగ్గించింది. కానీ మనం అంగన్వాడీల ప్రమాణాలను పెంచి బలోపేతం చేసుకుంటున్నాం. గురుకుల పాఠశాలలను 1201కి పెంచుకున్నాం. గురుకులాల బడ్జెట్ రూ. 3250 కోట్లు కేటాయించాం. విద్యాశాఖకు రూ. 25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. అటవీ శాఖలో కూడా యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. ఇది దేశంలోనే తొలి యూనివర్సిటీ. అక్కడ చదువుకున్న విద్యార్థులు జాతీయ స్థాయి ఉద్యోగాలను సంపాదిస్తున్నారు. గురుకులాల్లో పీజీ, లా, డిగ్రీ కాలేజీలను ప్రారంభించుకున్నాం. వ్యవసాయ, వెటర్నరీ శాఖల్లో కూడా కాలేజీల స్థాపన జరుగుతుంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది అని హరీశ్రావు స్పష్టం చేశారు.