Harish Rao | హైదరాబాద్ : పని తనమే తప్ప పగతనం లేని నాయకుడు కేసీఆర్ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. నిజంగా కేసీఆర్కు పగ ఉంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎప్పుడో జైల్లో కూర్చునేవాడు. కేసీఆర్ ఎంతసేపు ప్రజలకు ఏం చేయాలో ఆలోచిస్తారని హరీశ్రావు స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా హరీశ్రావు ప్రసంగించారు.
సుధాకర్ అన్న సొంతింటికి రావడం సంతోషంగా ఉందన్నారు హరీశ్రావు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో ఉండి, కరుడుగట్టిన ఉద్యమకారుడిగా పని చేశారు. తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డవారు. ఇవాళ బాగా ఆలోచించి ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వం ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని నమ్మి, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీలో చేరారని హరీశ్రావు తెలిపారు.
ఉద్యమకారులపై తుపాకీ గురి పెట్టిన వ్యక్తి.. ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అని హరీశ్రావు ధ్వజమెత్తారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డేమో ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయారు. వెన్నుచూపి పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి. తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డ నేత కేసీఆర్ అని తెలిపారు.
నిన్న మొన్న రాహుల్ గాంధీ వచ్చిండు. బీజేపీకి వ్యతిరేకండగా పోరాడడమే నా డీఎన్ఏలో ఉన్నదని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి డీఎన్ఏలో ఏమున్నదో కనుక్కోండి. ఏబీవీపీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉన్నదా..? బీఆర్ఎస్ ఉన్నదా..? కాంగ్రెస్ ఉన్నదా..? ఆయన డీఎన్ఏలో ఏమున్నదని అడుగుతున్నానని హరీశ్రావు ప్రశ్నించారు. ఎన్ని పార్టీలు మారిండు ఆయన. మీ డీఎన్ఏ, ఆయన డీఎన్ఏ మ్యాచ్ అవుతదలేదు. అది సరి చేసుకోండి. ఓటుకు నోటు చేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగను పక్కన పెట్టుకుని రాహుల్ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. రాహుల్ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్రావు నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కరువయ్యారని హరీశ్రావు పేర్కొన్నారు. నీ తల్లిని బలిదేవత, బండబూతులు తిట్టిన వ్యక్తికి పీసీసీ అధ్యక్షుడిగా నియమించుకున్నారు. కుటుంబ పాలన అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో గాలి లేదు. అభ్యర్థులను డిక్లేర్ చేస్తలేవు. విషయం లేక రాహుల్, రేవంత్ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ తన పేరును రాంగ్ గాంధీగా మార్చుకోవాలి. అబద్ధాలు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఛత్తీస్గఢ్లో ధాన్యం కొన్నామని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. మన కేసీఆర్ పండించిన పంటంత కొన్నాడు. ఛత్తీస్గఢ్లో కేవలం ఎకరానికి 13 క్వింటాల్స్ కొన్నారు. యాసంగిలో ధాన్యం అసలే కొనలేదు కాంగ్రెస్ పార్టీ అని హరీశ్రావు మండిపడ్డారు.
కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ కూడా వస్తలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. తెలంగాణను వచ్చి ఉద్దరిస్తం అంటే మోసం చేయడం కాదా..? రాజస్థాన్, హిమాచల్లోనూ అదే పరిస్థితి. కేసీఆర్ పాలన గొప్పగా ఉంది. మాట మీద ఉండే నాయకుడు కేసీఆర్. మన మేనిఫెస్టోను, పథకాలను కాంగ్రెస్ కాపీ కొట్టింది. రైతుబంధు ఆలోచన సృష్టికర్త కేసీఆర్. కేసీఆర్ మళ్లీ గెలవాలి. మన తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెట్టాలి. కాంగ్రెస్ చేతిలో పెడితే తెలంగాణ ఆగమైపోతదనే విషయం గ్రహించాలని హరీశ్రావు సూచించారు.
మంచినీళ్లు, కరెంట్, ప్రాజెక్టులు ఎలా ఇవ్వాలో కేసీఆర్ ఆలోచించారని హరీశ్రావు గుర్తు చేశారు. కేసీఆర్కు పని మీద, ప్రజల మీద ధ్యాస, అట్టడుగు వర్గాలపై ప్రేమ. నా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచించే నాయకుడు కేసీఆర్. కులమతాలకు అతీతంగా కేసీఆర్ను మూడోసారి గెలిపించుకోవాలి. ఇవాళ రాష్ట్రం సంతోషంగా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం కేసీఆర్. కేసీఆర్ ఉన్న తొమ్మిదిన్నరేండ్లలో కరువు, కర్ఫ్యూ లేదు. కాంగ్రెసోళ్లు వస్తే కరువులు, కర్ఫ్యూలు తప్పకుండా వస్తాయని హరీశ్రావు హెచ్చరించారు.