Harish Rao | ఖమ్మం : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పాలమూరు ప్రజల కరువు తీర్చే అతిపెద్ద ప్రాజెక్టు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ దండగ కాదు, ప్రతిపక్షాలు దండగ అని ధ్వజమెత్తారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మంత్రి హరీశ్రావు మాట్లాడారు.
సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్ట్ ప్రారంభం చేస్తాం అంటే ప్రతిపక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ప్రాజెక్టు ప్రారంభాన్ని ప్రజలు పండుగలా భావిస్తే, వారు దండగ అంటున్నారు. ఓ వైపు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంటే మరో వైపు అడ్డంకులు సృష్టించారు. ఇప్పుడు ప్రాజెక్టు ప్రారంభం చేస్తామంటే.. మళ్లీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రజలపై పగ సాధిస్తున్నారని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కావాలి.. కాంగ్రెస్ వద్దు అని ప్రజలు నినదిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నోబెల్స్, గోబెల్స్కి మధ్య పోటీ జరగబోతుందన్నారు. గోబెల్స్ ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీని ప్రజలు కోరుకోరు. బీఆర్ఎస్ పార్టీ మరోసారి గెలుస్తుందన్నారు.
లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని హరీశ్రావు తెలిపారు. ఆటో డ్రైవర్ కొడుకు, హమాలీ కుమారుడు ఎంబీబీఎస్ చదవటం సంతోషంగా ఉందన్నారు. ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందన్నారు. ఐటీ ఉత్పత్తిలో, ఫార్మా రంగంలో, విద్య, వైద్యం, పంట, పాడి ఏ రంగం చూసినా తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి స్పష్టం చేశారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదు. ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదు. ఆకలి అయితే నాడు అన్నం పెట్టలేదు. కానీ నేడు గోరుముద్దలు తినిపిస్తం అంటున్నారు. ఛత్తీస్గఢ్, కర్ణాటక, రాజస్థాన్లో చేయరు.. కానీ ఇక్కడ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎరువుల కోసం ప్రజలు తన్నులు తినేవారు. తన్నుల పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అయితే, బీఆర్ఎస్ పార్టీది పంట ఉత్పత్తి సంస్కృతి అని పేర్కొన్నారు.
ఏం జరగక ముందే సీట్లు, పదవుల కోసం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతున్నదని హరీశ్రావు తెలిపారు. మత కలహాలు సృష్టించి ఎంతకైనా దిగజార్చే పరిస్థితి కాంగ్రెస్ది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ ఉండే, ఇప్పుడు బెంగళూరు అయ్యింది. మాకు హైకమాండ్ ప్రజలే అని తేల్చిచెప్పారు. సీతారామ పథకం పనులు చివరి దశలో ఉన్నాయి. ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే కేసీఆర్ను దీవించండి అని పేర్కొన్నారు. సీతారామ పూర్తయితే కరువు అనే పదం డిక్షనరీలో ఉండదు. వచ్చే వానాకాలం నాటికి కృష్ణాలో నీళ్ళు ఉన్నాలేకున్నా గోదావరి జలాలు వస్తాయని హరీశ్రావు స్పష్టం చేశారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అని హరీశ్రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసి కార్మికులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. ఇది కేసీఆర్ ఇచ్చిన బహుమతి. మీ చిరకాల వాంఛ నెరవేర్చింది కేసీఆర్ మాత్రమే. ఇక నుండి ఆర్టీసీ కార్మికులు కాదు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. ఇన్ని రోజులు పెండింగ్లో పెట్టినప్పటికీ ఇవాళ ఆమోదం తెలిపింది. ధర్మం గెలుస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. నాటి పాలకులు ఆర్టీసీ అడ్రస్ లేకుండా చేయాలని కుట్రలు పన్నారు. మా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు పట్టం కట్టింది. ప్రభుత్వ ఉద్యోగులను చేసింది అని హరీశ్రావు తెలిపారు.