Minister Harish Rao | కరీంనగర్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): అత్మగౌరవం గురించి తరచూ చెప్పే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సమైక్యవాదులతో చేతులు కలిపి హుజూరాబాద్ ప్రజల అత్మగౌరవాన్ని మంటగలిపారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో శుక్రవారం జరిగిన ప్రజా ఆశీర్వాద ర్యాలీకి హాజరైన హరీశ్.. వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమైక్యవాది అయిన పవన్కల్యాణ్తో పొత్తు పెట్టుకున్న ఈటల ఆత్మగౌరవం ఏమై పోయిందని ప్రశ్నించారు. ఆనాడు తెలంగాణకు నిధులు కావాలని అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి ఇప్పుడు బీజేపీకి, ఈటల రాజేందర్కు ముఖ్యసలహాదారుడని విమర్శించారు. తెలంగాణ వస్తే అన్నం తినబుద్ధికాలేదన్న పవన్ కల్యాణ్తో తెలంగాణ బీజేపీ పొత్తు పెట్టుకున్నదని అన్నారు. పదవుల కోసం సమైక్య వాదులతో చేతులు కలిపిన రాజేందర్ గురించి ఒక్కసారి ఆలోచించాలని ప్రజలను కోరారు.
కౌశిక్రెడ్డి గెలుపు ఖాయం
ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఈటల రాజేందర్ చాలా మాయ మాటలు చెప్పాడని హరీశ్ విమర్శించారు. ‘దళితబంధు పైసలు రావన్నరు. బ్యాంకుల పైసలు అటే పోతయన్నరు. ఇది ఓట్ల కోసమే ఇచ్చారని అన్నరు.. కానీ, అవన్నీ వచ్చినయా లేదా..? కేసీఆర్ అంటే ఒక నమ్మకం. విశ్వాసం.. నేను ఢిల్లీకి పెద్ద లీడర్ అయిపోయిన అని ఈటల చెప్పుకున్నడు. హుజూరాబాద్ను ఇట్ల చేస్తా.. జమ్మికుంటను అట్ల చేస్తా అని మాయమాటలు చెప్పి ఎన్నికల్లో గట్టెక్కిండు’ అని ఆరోపించారు. మళ్లీ ఈటల మాటలు వింటే హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో పదేండ్లు వెనుకకు పోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాలేదని, ఆ పార్టీకి ఉన్నవి కేవలం మూడు సీట్లు మాత్రమేనని అన్నారు. తల కిందికి పెట్టి కాళ్లు మీదికి పెట్టినా ఇప్పుడు ఆ మూడు సీట్లు కూడా బీజేపీకి రావని చెప్పారు.
ఎవరు అవునన్నా, కాదన్నా, తెలంగాణపై ఎవడు ఎన్ని ట్రిక్కులు చేసినా మూడోసారి సీఎం అయ్యేది కేసీఆరే.. కేసీఆర్ పెట్టిన కౌశిక్రెడ్డి గెలిస్తే హుజూరాబాద్కు లాభమైతదా..? ఇంకెవరన్నా గెలిస్తే లాభమైతదా..? ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి’. మీ ఉత్సాహం.. మీ అందరి ఊపు చూస్తుంటే ఈసారి కౌశిక్రెడ్డి గెలుపు ఖాయమని అనిపిస్తున్నది.
– మంత్రి హరీశ్రావు
ఈటల గజ్వేల్ను ఉద్ధరిస్తడట
ఇంట్ల ఈగల మోత.. బయట పల్లకీల మోత అన్నట్టు హుజూరాబాద్లో ఏం సక్కగ లేదుగానీ గజ్వేల్ను ఉద్ద్ధరిస్తానని ఈటల బయలుదేరారని హరీశ్ మండిపడ్డారు. గజ్వేల్లో కేసీఆర్ ఏం చేసిండో తెల్వదా? దాని ముకాబులా దేశంలో ఇంకే నియోజకవర్గమైనా ఉన్నదా అని ప్రశ్నించారు. హుజూరాబాద్, గజ్వేల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ రెంటికీ చెడ్డ రేవడి అయ్యేది ఖాయమని అన్నారు. ఈటల రాజేందర్కు ఏడు సార్లు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి కౌశిక్రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు. ‘ఈ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నేను చూసుకుంట. మరో సిద్దిపేటలాగా హుజూరాబాద్ను తయారు చేస్తా.. ఏ ఒక్క పనీ వదలకుండా అన్ని పనులు చేసిపెడుతా’ అని హరీశ్ హామీ ఇచ్చారు.
ఢిల్లీ నేతలు ఏం తెచ్చారు?
‘రాజేందర్ రోజుకొక ఢిల్లీ నాయకున్ని తీసుకొస్తున్నడు. మనకు వాళ్ల ఊరు తెల్వది, పేరు తెల్వది. వాళ్లేదో హిందీ మాట్లాడుతరు. మనకు అర్థం కాదు. వాళ్లు చెప్పుడు ఎక్కువ, చేసుడు తక్కువ. ఆ లీడర్లు జమ్మికుంట, హుజూరాబాద్కు చేసిన ఒక్క పని పేరు చెప్పాలె. ఢిల్లీ చేతిలో ఉన్న ఉప్పల్ ఆర్వోబీ ఇప్పటికీ పెండింగ్లో ఉన్నది. ఉప ఎన్నికలు పోయి రెండేండ్లు అవుతున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఊరిలోనైనా ఒక్క తట్టెడు మట్టి ఎత్తినవా.. ఒక్క రూపాయి పనైనా చేసినవా..? జనంకు దూరమైండు, టీవీలకు దగ్గరయ్యిండు. ఎనుకటికి ఒక సామెత చెప్పినట్టు.. నమ్మి నానబోస్తె.. పుచ్చి బుర్రలైనయట. ఈటలను నమ్మి ఓట్లేస్తే హుజూరాబాద్ను మర్చి పోయిండు. ఇదే కౌశిక్రెడ్డి ఓడిపోయినా మీ మధ్యనే ఉన్నడు. ఇంటింటికీ వచ్చి కల్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చిండు. ఆపద వస్తే ఇంటికి వచ్చి నిలబడ్డడు’ అని చెప్పారు.
బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నాయకులు
సిద్దిపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. సిద్దిపేట శివానుభవ మండపంలో జరిగిన కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముషీనం శ్రీనివాస్ (మంగోల్), కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, ఎన్ఎస్యూఐ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు శ్రావణ్తోపాటు పలువురు బీఆర్ఎస్లో చేరగా మంత్రి హరీశ్రావు గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. – సిద్దిపేట కమాన్