హైదరాబాద్ : ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ, తీవ్రత తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా అని ఆ వేరియంట్ పట్ల నిర్లక్ష్యం వహించకూడదు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ను అడ్డుకునేందుకు ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలి. మాస్కు తప్పకుండా ధరించండి.. వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం కూడా పాటించాలి. ఈ మూడు పాటించినప్పుడే వైరస్ను ఎదుర్కోనే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి.. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనాలి అని హరీశ్రావు సూచించారు.
వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ప్రత్యేక వార్డు, ఆక్సిజన్ ప్లాంట్, 12 పడకల ఐసీయూ వార్డును మంత్రి హరీశ్రావు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ యాక్షన్ ప్లాన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో పడకలను పెంచుతున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో మరో వంద పడకల ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసుకున్నాం. దీంతో మొత్తం 220 పడకల దాకా అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో నిర్మాణ్ సంస్థ సహకారంతో 12 ఐసీయూ పడకల వార్డ్, ఇన్ఫోసిస్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించుకున్నామని తెలిపారు.
కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకొనే విధంగా 1600 పడకలు హైదరాబాద్లో ఏర్పాటు చేశామన్నారు. నిలోఫర్లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నాము. మరో 6 ఆస్పత్రుల్లో 100 పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నాము అని హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ను కర్ణాటక, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో లేదు. రాష్ట్రంలో ఆక్సిజన్ కెపాసిటీని మూడింతలకు పెంచుకున్నామని తెలిపారు. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, స్టోరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాం అని మంత్రి తెలిపారు.
గడ్డి అన్నారం మార్కెట్లో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు అతి త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించబోతున్నామని తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే ఎల్బీనగర్, మలక్పేట ప్రాంత వాసులతో పాటు సమీప ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. త్వరలోనే టెండర్లు పిలవబోతున్నాం. మన్సూరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేస్తామని మంత్రి హరీశ్రావు చెప్పారు.
బస్తీ దవాఖానాలు సూపర్ హిట్టు అయ్యాయి. దేశానికి ఈ దవాఖానాలు ఆదర్శంగా నిలిచాయి. హైదరాబాద్లో అవసరమైన చోట మరిన్ని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇతర మున్సిపాలిటీల్లో కూడా బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 147 బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని మంత్రి హరీశ్రావు వెల్లడించారు.