హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో చికిత్స పొందుతున్న కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని, సూపర్ స్పెషాలిటీ వైద్యులను రప్పించాలని, ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని నిమ్స్ వైద్యులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ఈ సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. గురువారం ఆయన ప్రీతి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు.
డాక్టర్ ప్రీతి ఆరోగ్యం విషమంగా ఉన్నదని నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. గురువారం అర్ధరాత్రి ఆయన ప్రీతి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రత్యేక వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని తెలిపారు. వైద్య సేవలపై మంత్రి హరీశ్రావు గంట గంటకు ఆరా తీస్తున్నారని, ఆమె ఆరోగ్యం కోసం ఏ సూపర్ స్పెషాలిటీ నిపుణులనైనా సరే రప్పించాలని, ఎంత ఖర్చు అయినా వెనుకాడొద్దని తమకు ఆదేశాలు ఇచ్చారని డాక్టర్ బీరప్ప పేర్కొన్నారు.
ప్రీతి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. గురువారం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అప్పటికే అనేక అవయవాలు విఫలం అయ్యాయని, వెంటిలేటర్పై ఉంచారని నిమ్స్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తున్న నేపథ్యంలో ఎక్మోపై ఉంచామని వివరించారు. డీఎంఈ రమేశ్రెడ్డి నిమ్స్ను సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. గవర్నర్ తమిళిసై కూడా నిమ్స్కు వెళ్లి, ప్రీతి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆమె కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో వరంగల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.