ఖమ్మం సిటీ, మార్చి 23: ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్వజన దవాఖానలోని పిల్లల విభాగం యంత్రాంగానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. చిన్న పిల్లల వార్డును ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు ఆప్యాయతతో కూడిన వైద్య సేవలు అందిస్తున్నారంటూ గురువారం ట్వీట్ చేశారు.
ఖమ్మం వైద్యులు, సిబ్బంది ఆలోచన, ఆచరణ తెలంగాణలోని ఇతర జిల్లాల ప్రభుత్వ దవాఖానల యంత్రాంగానికి స్ఫూర్తిగా ఉందంటూ కొనియాడారు. తమ సేవలను గుర్తించి స్వయంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అభినందిస్తూ ట్వీట్ చేయడం పట్ల ఖమ్మం ప్రభుత్వ వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ముందు కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని పేర్కొన్నారు.