సిద్దిపేట, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దుబ్బాక, దుబ్బాక టౌన్: ‘కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు కోతలు, చీకటి రోజులు వస్తాయి. దవాఖానల్లోకి పందులు, పందికొక్కులు వస్తాయి. ఖాళీ నీళ్ల బిందెలతో కొట్లాడుకొనే పరిస్థితి వస్తుంది’ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆ పార్టీకి ఓటేస్తే మనవి కష్టాల బతుకులేనని చెప్పారు. సోమవారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్లో విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళనానికి హరీశ్ హాజరయ్యారు. గజ్వేల్, వర్గల్, ములుగు మండలకేంద్రాల్లో నిర్వహించిన రోడ్షోల్లో పాల్గొన్నారు. దుబ్బాకలో సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే నిండా మోసపోతామని ప్రజలను హెచ్చరించారు. అలా నమ్మి ఓటేసిన కర్ణాటక రైతుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైందని గుర్తుచేశారు. ఇప్పుడు ఎందుకు గెలిపించాం అని లబోదిబో మొత్తుకుంటున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ వ్యవసాయాన్ని దండగ అంటే, కేసీఆర్ పండుగ చేశారని తెలిపారు. మన వద్ద కరెంట్ సమస్య వస్తే 24 గంటల్లోపలే కొత్త ట్రాన్స్ఫార్మర్ను అందిస్తున్నామని అన్నారు. ఒకప్పుడు రాత్రిపూట బావుల వద్దకు పోయి మోటర్ పెట్టడానికి కటిక నేల మీద కునుకు తీసిన రోజులు ఉండేవని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో కాన్పుకు పోతే రూ.40 వేల నుంచి రూ.50 వేల దాకా ఖర్చు అయ్యేదని, కానీ, ఇప్పుడు ప్రభుత్వ దవాఖానలు కార్పొరేట్ స్థాయిలో మారాయని, రూపాయి ఖర్చు లేకుండా ప్రసూతి చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటివద్దకు పంపిస్తున్నామని వివరించారు.
కాంగ్రెస్ నేతలది సుతిలేని సంసారం
రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలది సుతిలేని సంసారం అని, ఎవరికి వారే సీఎం అభ్యర్థులు, వాళ్లలో వాళ్లే తన్నుకోనేందుకు సరిపోతుంది అని హరీశ్ ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ ఎండ్రికాయల పార్టీ. ఒకరి కాళ్లు ఇంకొకరు గుంజుతరు. ఎవరూ ముందుకు పోరు. ఇగ, ఇప్పుడొచ్చి బీజేపోడు సుట్టరికం కలుపుతున్నాడు. బీజేపీవాడు ఒక్క మంచిపని చేసిండా? రూ.400 ఉన్న సిలిండర్ను రూ.1,000 చేసిండు. పాల మీద, చేనేత పరిశ్రమ మీద జీఎస్టీ వేసిండు. బాయికాడ మీటర్ పెట్టుమన్నాడు. మీ ఇంటికాడికి బిల్లుపంపుతానన్నాడు. బీజేపీ, కాంగ్రెస్వాళ్లకు చేసింది చెప్పుకునే ముఖం లేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమలు కానీ హామీలు ఇస్తున్నారు. ఈ రెండు పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు. సిగ్గులేకుండా వస్తున్న ఆ పార్టీవాళ్లను అక్కాచెల్లెళ్లు పొలిమేరదాకా చీపురు కట్టలతో తరిమికొట్టాలని అన్నారు. ‘ఈటల రాజేందర్ ఇక్కడి ప్రజల కష్టసుఖాల్లో ఉన్నారా? కరోనా సమయంలో అందరు భయపడితే నేను మొదటి కరోనా పేషెంట్ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పాను. ప్రజల కష్టసుఖాల్లో మనమే ఉన్నాం. అప్పుడు ఈటల రాజేందర్ వచ్చాడా?’ అని నిలదీశారు.
గజ్వేల్లో నీళ్ల గలగలలు
పదేండ్లలో సీఎం కేసీఆర్ హయాంలో గజ్వేల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్ అన్నారు. నాడు చుక్క నీరు లేని గజ్వేల్ ప్రాంతాన్ని, నీళ్ల గజ్వేల్గా మార్చారని చెప్పారు. బోరు నీళ్ల గజ్వేల్కు గోదావరి నీళ్లు వచ్చాయని తెలిపారు. కాళేశ్వరం నీళ్లతో చెరువుల, చెక్డ్యాంలను నింపుకుంటున్నామని వెల్లడించారు. ఎండాకాలంలో హల్దివాగులో నీళ్లు నింపి జీవనదిగా మార్చారని, తాగు, సాగు నీటికష్టాలను తీర్చారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి సీఎం ఎవరు అంటే గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అంటారని, గజ్వేల్కు అంత గొప్ప పేరున్నదని చెప్పారు. కేసీఆర్ హ్యాట్రిక్గా గెలిస్తే గజ్వేల్ పేరు మరోసారి మారుమోగుతుందని తెలిపారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.
కర్ణాటకలో ప్రజల గగ్గోలు
5 గ్యారంటీల పేరిట కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మోసం చేయటంతో అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారని హరీశ్రావు అన్నారు. మెడికల్, పీజీ చదివే విద్యార్థుల స్కాలర్షిప్ల్లో 80 శాతం కోత పెట్టిందని, ఇక రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని వెల్లడించారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 357 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారని వివరించారు. ఇచ్చే 3 గంటల కరెంట్ 30 సార్లు ట్రిప్ అవటంతో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని అన్నారు.
బీజేపీది మేకపోతు గాంభీర్యం
‘రాష్ట్రంలో బీజేపీకి ఒకటో, రెండో సీట్లు.. దానికే మేకపోతు గాంభీర్యం. సొంత పార్టీ నాయకులకే ఆ పార్టీపై నమ్మకం లేదు. ప్రజలకైతే అసలే నమ్మకం లేదు. ఆ పార్టీ ప్రజలకు ఏమీ చేయలేదని రోజుకో నాయకుడు బయటకు వస్తున్నారు. విజయశాంతి, వివేక్, రాజగోపాల్రెడ్డి, చంద్రశేఖర్ ఇలా రోజుకొక్కరు రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు రాజీనామా చేసి వెళ్తున్నారు. బీజేపీ మాటలన్నీ నీటిమీది రాతలు. వాళ్ల మ్యానిఫెస్టో ఓ ఫాల్స్. తమను తాము మభ్యపెట్టుకుంటూ ప్రజలను మోసపుచ్చడమే బీజేపీ లక్ష్యంగా మారింది’ అని హరీశ్రావు విమర్శించారు. కార్యక్రమాల్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ మాదాస్ శ్రీనివాస్, ఎంపీపీ, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు. రోడ్షోలకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు, ముఖ్యంగా మహిళలు భారీగా తరలివచ్చారు.
ఒకప్పుడు దొంగ రాత్రి కరెంట్.. ఇప్పుడు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్
– మంత్రి హరీశ్రావు
ఓటు అంటే మూడొద్దుల మురిపెం కాదు. ఐదేండ్ల భవిష్యత్తు.కండ్ల ముందున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటెయ్యండి.
– మంత్రి హరీశ్రావు
జయశంకర్ సార్ను కించపరిచేలా రేవంత్ వ్యాఖ్యలు
తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదం లేదని ప్రొఫెసర్ జయశంర్ సార్ను కించపరిచేలా రేవంత్రెడ్డి మాట్లాడారని టీపీసీసీ చీఫ్పై హరీశ్ ధ్వజమెత్తారు. ‘జయశంకర్ సార్ ఆ నినాదాన్ని ప్రజల మనసుల్లోంచి పుట్టించారు. సార్ ఆశయాల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారు’ అని వెల్లడించారు.
ఈటల రాజేందర్ తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు. అన్నం పెట్టిన చెయ్యికి సున్నం పెట్టారు. రాజేందర్ను సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా, శాసనసభ పక్షనేతగా, మంత్రిగా చేశారు.ఇంత చేసిన కేసీఆర్ను విమర్శించటం ఆయనకు తగునా?
– మంత్రి హరీశ్రావు
బీడీ కట్టలపై కాంగ్రెస్ పార్టీ పుర్రె గుర్తు పెట్టింది. బీజేపీ జీఎస్టీ వేసింది. కేసీఆర్ మాత్రం బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చారు.
– మంత్రి హరీశ్రావు
ఉప్పు నీళ్ల గజ్వేల్లో గోదావరి నీళ్లు ఉప్పొంగేలా చేసింది సీఎం కేసీఆర్.గజ్వేల్కు రోడ్డు, రేడియల్ రోడ్డును తీసుకొచ్చారు. రైలును సైతం తెచ్చారు.
– మంత్రి హరీశ్రావు
శివుడి నెత్తిమీద గంగమ్మ లెక్క వర్గల్ నెత్తిమీద కొండ పోచమ్మ రిజర్వాయర్ను కేసీఆర్ కట్టారు.
– మంత్రి హరీశ్రావు