Minister Gangula | సీఎం కేసీఆర్ (CM KCR) ఆకాంక్షల మేరకు రైతులు, పేదలకు పౌర సరఫరాలశాఖ సేవలు అందిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఎంలు, ఉద్యోగులతో మంత్రి హైదరాబాద్లోని కార్పోరేషన్ భవన్లో భేటీ అయ్యారు . ఉద్యోగుల డైరిని ఆవిష్కరించి, వారికి హెల్త్ కార్డులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎంఆర్ (CMR) డెలివరీ త్వరగా పూర్తి చేయడంతో పాటు రాబోయే కొత్త పంట వచ్చే సమయానికి రైస్ మిల్లులు, గోదాంలను ఖాళీ చేయాలని ఆదేశించారు. డిపార్ట్మెంట్లో ప్రతి ఉద్యోగి నిరంతరం అప్రమత్తంగా ఉండి.. రైతులకు సేవలందించాలన్నారు.
తెలంగాణ ధాన్యం సేకరణలో దేశానికే రోల్ మోడల్గా నిలిచిందన్న గంగుల.. గతంలో 25లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1.41 కోట్ల మెట్రిక్ టన్నులకు సేకరణను పెంచామన్నారు. కరోనా వంటి క్లిష్ట సమయాల్లోనూ బయటకు రావడానికే భయపడుతుంటే.. పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులు రికార్డు స్థాయిలో యాసంగి ధాన్యం 92లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల ముంగిటకే వెళ్లి సేకరించారన్నారు. ప్రభుత్వం ఏ పని చేసినా రైతు సంక్షేమంతో కూడుకొని ఉంటుందని, అదే దృష్టితో పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులు రైతుల కోసం, పేదల కోసం పనిచేయాలన్నారు.
ఇటు రైతుల పంటను సేకరిస్తూ దాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి పేదలకు రేషన్ ద్వారా పంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న సివిల్ సప్లైస్ ఉద్యోగులు మధ్యతరగతి వాడుకునే వినియోగ వస్తువుల బ్లాక్ మార్కెట్కి అరికట్టి, ధరల స్థిరీకరణలో ఘనమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. ఉధ్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్పోరేషన్ ఉద్యోగులు కోరుతున్న రీతిలో వారికి ఆరోగ్య భద్రతను కల్పించేందుకు 3లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ని గత సంవత్సరం డిసెంబర్ నుంచి ప్రారంభించామన్న మంత్రి.. డిజటల్ కార్డులను ఉద్యోగులకు అందించారు.
కార్పోరేషన్లోని 244 మంది ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ ద్వారా క్యాష్ లెస్ వైద్య సేవల్ని ప్రారంభించామన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాబోయే యాసంగి ధాన్యం సేకరణకు కార్యాచరణ చేపడుతున్నామని, ప్రభుత్వ లక్ష్యం మేరకు రైతులకు అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి అంశాన్ని ఉపేక్షించమని, ప్రభుత్వం దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ కార్పోరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, ఉద్యోగుల సంఘం నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.