హైదరాబాద్ : పేదలతో పాటు అన్ని వర్గాలు ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula ) వెల్లడించారు. ఇందులో భాగంగా పేదల ఆకలిని తీర్చడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ హామీతో సమ్మెను విరమించుకున్న రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులతో బుధవారం హైదరాబాద్ సచివాలయంలోని కార్యాలయంలో మంత్రి సమావేశం నిర్వహించారు.
సమ్మెను విరమించుకున్నందుకు ముందుగా మంత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు. రేషన్ డీలర్ల(Ration Dealers) సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రేషన్ డీలర్ల గౌరవ భృతి, కమిషన్ పెంపు అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కరోనా క్లిష్ట సమయంలో రేషన్ పంపిణీ చేశారని అభినందించారు.
మంత్రి స్పష్టమైన హామీతో అన్న జిల్లాల రేషన్ డీలర్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ వి. అనిల్ కుమార్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయాదేవి, ఇతర ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల రేషన్ డీలర్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంఘాల నేతలు పాల్గొన్నారు.