కరీంనగర్: అంబేద్కర్ భవనం జ్ఞాన సముపార్జనకు కేంద్రం కావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని చింతకుంటలో 8 కోట్ల రూపాయలతో ఎకరన్నర స్థలంలో విశాలంగా నిర్మించిన అంబేద్కర్ భవన్ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. అనాదిగా దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనక్కి నెట్టి వేయబడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. స్వయం పాలనలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
కరీంనగర్లో నిర్మించిన అంబేద్కర్ భవనం దళితులకు అండగా నిలువాలని మంత్రి గంగుల ఆకాంక్షించారు. దళిత బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్తోనే అభివృద్ది సాధ్యమని, మరోసారి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. అన్ని వర్గాల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముందు చూపుతో గొప్ప రాజ్యంగాన్ని రచించారని, 75 సంవత్సరాలుగా ఆ రాజ్యాంగమే మార్గదర్శకంగా దేశంలో పాలన కొనసాగుతున్నదని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే స్వరాష్ట్రం సిద్ధించిందన్నారు.
మహానీయుడు అంబేద్కర్ ఏ ఒక్క కులానికో, మతానికో చెందిన వారు కాదని, ఆయన ఈ దేశానికి ఆస్తి అని మంత్రి అన్నారు. అనాదిగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు. దళితులకు ఒక వేదిక ఉండాలని భావించి తానే ముందుండి అంబేద్కర్ భవనాన్ని నిర్మించి ఇచ్చానన్నారు. రాజసం ఉట్టిపడేలా ఈ భవనాన్ని నిర్మించానని, దళితులు ఈ భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ భవనం వేదికగా దళిత బిడ్డలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి కోచింగ్లు ఇవ్వాలని సూచించారు. కరీంనగర్లో దళిత బిడ్డలకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు భవనాలు కావాలని అడిగితే మరు నిమిషం ఆలోచించకుండా ఆమోదం తెలిపిన ఘనత సీఎం కేసీఆర్దని గంగుల కొనియాడారు.
అంబేద్కర్ భవనం కరీంనగర్-వేములవాడ ప్రధాన రహదారి పక్కన ఉండటం అడ్వాంటేజ్ అని, రోడ్డు వైపు కమర్షియల్ కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని మంత్రి గంగుల సూచించారు. షట్టర్లను నిర్మించి కిరాయికి ఇస్తే వచ్చే సొమ్ముతో భవనం మెయింటెనెన్స్ జరిగిపోతుందన్నారు. అంతేకాకుండా భవన ప్రాంగణంలో గొప్పగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇందుకోసం రిటైర్డ్ ఉద్యోగులతో కమిటీ వేసుకుని, ప్రతి వారం సమావేశాలు ఏర్పాటు చేసుకుని, అభివృద్ధిపై తీర్మాణాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలోనే మైనార్టీ భవనాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రిస్టియన్ భవనం కోసం అర ఎకరం కేటాయించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, మున్సిప్ కోఆప్షన్ సభ్యులు అమ్జద్ అలీ, కోఆప్షన్ సభ్యులు సాబీర్ పాషా, 56వ డివిజన్ కార్పోరేటర్ వంగపల్లి రాజేందర్ రావు, దళిత సంఘం నేతలు సుద్దాల లక్ష్మణ్, గోస్కి శంకర్, సముద్రాల అజయ్, బోయినిపల్లి చంద్రయ్య, గసికంటి కుమార్, సోమారపు సతీష్ కుమార్, వడ్లూరి శ్రీను, ఎర్రోళ్ళ ప్రశాంత్, కాసారపు కిరణ్, గడ్డం కొమురక్క, మేడి మహేష్, కామారపు శ్యామ్, తీట్ల ఈశ్వరీ తదితరులు పాల్గొన్నారు.