కరీంనగర్ : కరీంనగర్ నగరాన్ని ఆధునీకరించి సుందరంగా తీర్చిదిద్దేలా సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టామని బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమాలాకర్ అన్నారు. మంగళవారం నగరంలోని కోతి రాంపూర్ డంపింగ్ యార్డ్(బయో మైనింగ్) పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోతిరాంపూర్లో 1980-82 కాలంలో డంపింగ్ యార్డ్ కోసం 9ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు.
ఈ డంపింగ్ యార్డులో సుమారుగా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందన్నారు. నిత్యం కరీంనగర్ పట్టణంలోని ఇంటింటా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తీసుకొస్తున్నారని, దీని ద్వారా వెలువడే కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాబోయో కాలంలో డంపింగ్ యార్డు కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డంపింగ్ యార్డును మరోచోటికి తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాంగంగా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రణాళిక ప్రకారం రూ.16. 50 కోట్లతో చెత్త తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
డంప్ యార్డు తొలగింపు ద్వారా కరీంనగర్ పట్టణం మరింత సుందరంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, నగర మేయర్ వై సునీల్ రావు, జిలా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్,మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, తదితరులు పాల్గొన్నారు.