కరీంనగర్ : ఆడబిడ్డల ఆశీర్వాద బలమే నాకు కొండంత బలమని నన్ను మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula )అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ పార్టీలని ఆ పార్టీలకు ఓటు వేస్తే తెలంగాణ మరోసారి గుడ్డిదీపం అవుతుందని ఆందోళనవ్యక్తం చేశారు. కరీంనగర్ సీతారాంపూర్లో 21, 22 డివిజన్ల మహిళల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్తో కలిసి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరై స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
2009, 2014, 2018 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలు కట్టిబెట్టిన ఆడబిడ్డలకు కృతజ్ఞతలు తెలిపారు.
మీ రుణం తీర్చుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే అభివృద్దిలో దూసుకుపోతుందని, అభివృద్ధి చెందుతున్న తెలంగాణనను మరోసారి దొంగల పాలు చేయొద్దని కోరారు.
కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ లతో ఇక్కడి యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. నెల రోజులు నా కోసం కష్టపడితే..5 సంవత్సరాలు ఆడబిడ్డల కోసం కష్టపడుతానని హామీ ఇచ్చారు. ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీలు ఓట్ల కోసం వస్తున్నారని, మీ పవిత్రమైన ఓటును ఆ పార్టీలకు వేసి వృథా చేయొద్దన్నారు.