కరీంనగర్ : కరీంనగర్ నియోజకవర్గ చరిత్రలో ఒకసారి గెలిచిన వ్యక్తి మరోసారి గెలవలేదని, నన్ను నమ్మి మూడు సార్లు గెలిపించారని, ఈ పదవి నాదే అయినా మీరు పెట్టిన భిక్షేనని..మరోసారి ఆశీర్వదిస్తే మరింత గొప్పగా పనిచేస్తానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. కరీంనగర్ పట్టణంలోని స్థానిక పద్మనాయక కళ్యాణ మంటపంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ సంక్షేమ ఫలాలు భవిష్యత్ తరాలకు అందాలంటే మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులను బలోపేతం చేయాలన్నారు. కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకొలేమన్నారు. మనం తప్పు చేస్తే భవిష్యత్ తరాలు అంధకారం అవుతాయని తెలిపారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టి మన సంపద దోచుకెళ్లాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 90 కు పైగా సీట్లు సాధించి అధికారంలోకి రానున్నమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం హామీలకే పరిమితం అని..కర్ణాటక లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటి మూటలు అయ్యాయని విమర్శించారు. 45 రోజులు నా కోసం పనిచేస్తే 5 ఏళ్లు మీకోసం పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నానని తెలిపారు. పదవులు ఎన్ని వచ్చినా తను మారే వ్యక్తిని కాదని, పార్టీ కార్యకర్తలే మా బలం..మా ధైర్యం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, పార్టీ మండల అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాయకులు వాసాల రమేష్, పిట్టల రవీందర్, జమీల్, సాబీర్ పాషా, గంగుల ప్రదీప్, నేతికుంట హరీష్, గంగాధర చందు, కుల్దీప్, శౌకథ్ అలీ, నవాజ్, తదితరులు పాల్గొన్నారు.