హైదరాబాద్ : 2022-23 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్లో బీసీ సంక్షేమ శాఖకు అవసరమైన నిధుల కోసం చేయాల్సిన ప్రతిపాదనలపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇదివరకే శాఖాపరంగా అవసరమున్న నిధులపై అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేసిన మంత్రి సోమవారం ఖైరతాబాద్లోని తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ఎంబీసీ, బీసీ కార్పొరేషన్ లు, బీసీ ఫెడరేషన్ లు, కల్యాణ లక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆత్మగౌరవ భవనాలు, తదితర అమలవుతున్న బీసీ సంక్షేమ, అభివృద్ధి, కార్యక్రమాలకు సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక శాఖకు సమర్పించాల్సిన బడ్జెట్ పై కసరత్తు నిర్వహించారు. నిర్వహణ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించేలా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించామని మంత్రి గంగుల తెలిపారు .
కార్యక్రమంలో బీసీ కార్పోరేషన్ ఎండి, మహాత్మాజ్యోతిబాపూలే గురుకులాల కార్యదర్శి మల్లయ్యబట్టు, బీసీ స్టడీసర్కిల్ ఎండీ అలోక్ కుమార్, వడ్డెర ఫెడరేషన్ ఎండీ బాలాచారి, రజక ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్, నాయీబ్రాహ్మణ పెడరేషన్ ఎండీ విమలాదేవి బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.