కరీంనగర్ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఢిల్లీకి, ఆంధ్ర నాయకులకు గులాములని, వారి మాయ మాటలు నమ్మి మోసపోతే తెలంగాణ అంధకారం అవుతుందని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. కొత్తపల్లి మండల కేంద్రంలో బుధవారం మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుండె నొప్పి అని చెప్పి దొంగ డ్రామాలు ఆడి ఎంపీ అయిన బండి సంజయ్ గెలిచిన తర్వాత నాలుగున్నర ఏళ్లుగా పత్తా లేకుండా పోయి మళ్లీ ఎన్నికలు రాగానే ఓట్ల కోసం వస్తున్నాడని ఆరోపించారు.
బీజేపీ అధ్యక్షుడిగా కోట్ల రూపాయలు వసూళ్లు చేసి ఆ అవినీతి సొమ్ముతో గెలిచేందుకు వస్తున్నాడని మండిపడ్డారు. ఓటుకు ఇరవై వేలు ఇచ్చేందుకు సిద్ధమైన బండి సంజయ్ వద్ద డబ్బును తీసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. దొంగకు టికెట్ అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మవద్దని..కాంగ్రెస్ ను నమ్మితే మళ్లీ కరెంటు కోతలు తప్పవన్నారు కొత్తపల్లిలో నిర్మించే మెడికల్ కాలేజీలో యాభై శాతం ఉద్యోగాలు స్థానిక కొత్తపల్లి వారికే ఇస్తామని తెలిపారు.