Minister Gangula | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగుర వేస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పద్మనాయక కల్యాణ మండలంలో బీఆర్టీయూ అనుబంధ కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను గజమాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కార్మికులు సమష్టి కృషితో ముందుకెళ్లాలన్నారు.
కార్మికులు లేబర్ యాక్ట్ ప్రకారం విధిగా బీమా చేయించుకోవాలని.. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అభివృద్ధికి పాటుపడుతానన్నారు. సహాయ సహకారాలు అందిస్తానన్నారు. స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ, కాంగ్రెస్లు ఒక్కటవుతాయని.. కేసీఆర్ను ఓడించేందుకు కుట్నపన్నుతున్నాయన్నారు. రేవంత్రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నాడని ప్రశ్నించారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపే కుట్ర జరుగుతుందని.. విలువైన ఓటును కారు గుర్తును గెలిపించాలని కోరారు.