Karimnagar | కరీంనగర్ : కరీంనగర్లోని కార్ఖనగడ్డ శ్మశాన వాటికలో దళితులు తమ పూర్వీకులను స్మరించుకుంటూ ఆదివారం దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకోగా, బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. వారితో కలిసి దళితుల పూర్వీకులకు మంత్రి గంగుల నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్లో ఆరు దశబ్దాలకు పైగా శ్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతుందన్నారు. పూర్వీకులను స్మరించుకుంటూ వారిని ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద కుటుంబ సభ్యులు దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారని తెలిపారు. ప్రతి ఏటా దీపావళి పండుగ నిర్వహించే శ్మశాన వాటికలో పండుగ నిర్వహణకు పూర్తిస్థాయిలో లైటింగ్, మంచినీటి సదుపాయం కల్పించామని వెల్లడించారు . ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్రావు, కార్పొరేటర్లు గంట కల్యాణి, కంసాల శ్రీనివాస్, సరిళ్ల ప్రసాద్, ఎదుళ్ల రాజశేఖర్, కుర్ర తిరుపతి, నక పద్మ కృష్ణ, నాయకులు ఎడ్ల అశోక్ పాల్గొన్నారు.