Gangula Kamalaker | జగిత్యాల : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకునేనని, పుట్టిన ఊరును జీవితాంతం మరువలేనని, ఎక్కడికెల్లినా తాను పైడిపల్లి( Pidipally ) బిడ్డనే అని చెప్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్( Gangula Kamalaker ) పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా( Jagtial dist ), వెల్గటూరు మండలం పైడిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తన తండ్రి గంగుల మల్లయ్య నెలమాసిక కార్యక్రమంలో సహచర మంత్రులు కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar ), ఎర్రబెల్లి దయాకర్ రావు( Errabelli Dayaker Rao ) తో కలిసి పాల్గొన్నారు. రూ. 12 కోట్లతో పైడిపల్లి-చెగ్యామ్ రూ. 1.40 కోట్లతో పైడిపల్లి – పడకల్ రోడ్డు నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ నడిబొడ్డున బాబాసాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రులు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తలాపున గలగలా గోదారి పోతున్నా నాడు మన బాయిలు ఎండిపోయి, చెరువులు నిండక పంటలు ఎండిపోయేవని, అరిగోస పడి పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర రాకపోయేదని వాపోయారు. అరిగోస పడుతున్న తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించారని, ఆ తర్వాత తెలంగాణ దేశానికే మార్గదర్శనం అయ్యేలా పరిపాలిస్తున్నారన్నారు. మేడిగడ్డ తలాపున గోదారిని కాలడ్డం పెట్టి ఆపినట్టు కాళేశ్వరం ద్వారా నీటిని మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసారన్నారు. గతంలో ధాన్యం అమ్ముకుందామంటే క్యాష్ కటింగ్ ఉండేదని, దళారుల దందాలుండేవని, దీంతో అప్పులకు మిత్తిలు పెరిగి పొలాలు అమ్ముకునే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ నేడు గిట్టుబాటు ధరతో చివరి గింజ వరకూ కొంటున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని స్పష్టం చేశారు.
రైతులు ఎప్ఏక్యూతో తెచ్చిన ధాన్యంలో గింజ కూడా తరుగు పెట్టకూడదని, అక్కడే ఉన్నకలెక్టర్ ఇతర ఉన్నతాధికారులకు ఆదేశాలను సైతం జారీ చేశారు మంత్రి గంగుల. ఒకనాడు కూతురు పెళ్లికోసం పుట్టింట్లో చేయిచాచినా, అన్నదమ్ముళ్లను అడిగినా రూపాయి పుట్టలేదని, నేడు కేసీఆర్ స్వయానా మేనమామలా కళ్యాణలక్ష్మీ అందింస్తున్నారన్నారు మంత్రి. తెలంగాణ రాష్ట్రం వచ్చినందునే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినందునే కాళేశ్వరం జలాలు, కళ్యాణలక్ష్మీ, 24 గంటల ఉచిత కరెంటు, పుష్కలమైన సాగునీరు వచ్చాయన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్కు మరింత బలం అందించాలన్నారు. ఢిల్లీలో పరిపాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల పరిపాలన ఎంత దారుణంగా ఉందో చూస్తున్నామని, తెలంగాణపై ప్రేమలేని ఆ పార్టీల మాటల్ని నమ్మి మోసపోయామంటే తెలంగాణ మళ్లీ పాత స్థితిలోకి వెళ్లి గుడ్డిదీపంలా మారుతుందని, వారిని దరిచేరనీయోద్దన్నారు గంగుల కమలాకర్.
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ పల్లెలను అభివృద్ధి చేస్తున్నారని కమలాకర్ పేర్కొన్నారు. పైడిపల్లి గ్రామస్థులకు అనువుగా ఉండే విధంగా అన్ని కులాలవారు ఉచితంగా ఫంక్షన్లు నిర్వహించుకునే విధంగా మల్టిపర్పస్ పంక్షన్ హాల్ నిర్మాణానికి తమ కుటుంబం తరుపున భూమిని ఇస్తామన్నారు. దానిని నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని సభాముఖంగా మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావును కోరారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధు, కలెక్టర్ యాస్మిన్ బాష, ఎస్పీ భాస్కర్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పైడిపల్లి గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.