Minister Gangula Kamalaker | కరీంనగర్ : నేరం జరిగిన తర్వాత నేరస్థులను శిక్షించడం కంటే.. నేరం జరగకూడదనే లక్ష్యంగా ముందు చూపుతో పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన ప్రేరణ అనే కార్యక్రమం అభినందనీయం అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్( Karimnagar ) కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్, ఆన్లైన్ మోసాలు, హోం లోన్ యాప్లు, కెరీర్ గైడెన్స్పై యువతకు అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ప్రేరణ – 2023 కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేరాలు జరగకుండా ప్రేరణ లాంటి కార్యక్రమాలు చేపట్టిన కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అభినందించారు. గత ప్రభుత్వాల హయాంలో చదువుకునే స్తోమత లేక ఎంతోమంది చదువుకు దూరమైన పరిస్థితిలు ఉండేవన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వంలో ప్రైవేటు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు. ఆనాడు చదువుకునే కోరికను చంపుకొని సంఘ విద్రోహక శక్తులుగా మారిన రోజులు ఉండేవని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రోజులు మారాయనీ, చదివించే స్తోమత లేకపోయినప్పటికీ తమ బిడ్డలు గొప్పగా చదువుకోవాలని ప్రతి తల్లిదండ్రులు రాత్రి పగలు కష్టపడి తమ పిల్లలను గొప్ప చదువులు చదివిస్తున్నారనీ తెలిపారు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి విద్యార్థి చదువుకోవాలనీ, తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసినప్పుడే మీ జన్మకు సార్థకత లభిస్తుందన్నారు. ప్రతి దాంట్లో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ రెండు ఉంటాయనీ, ప్రతి దానిని మంచి కోసం సద్వినియోగం చేసుకోవాలే తప్ప చెడు కోసం కాదని సూచించారు.
సెల్ ఫోన్లతో మంచి చెడు రెండు ఉంటాయనీ, మంచి కోసం వినియోగించుకోవాలనీ సూచించారు. నేటి రోజుల్లో 80 శాతం నేరాలు మద్యం మత్తులోనే జరుగుతున్నాయని తెలిపారు. మద్యంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనీ, మత్తు పదార్థాలకు బానిసలై బంగారం లాంటి జీవితాన్ని అంధకారం చేసుకోవద్దని సూచించారు. సమైక్య పాలనలో ఉన్నత చదువులు చదువుకున్న.. ఉద్యోగం రాక.. ఉపాధి లేక.. దుబాయ్, సౌదీ లాంటి దేశాలకు వలస పోయే పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. కానీ స్వయం పాలనలో కేసీఆర్ సీఎంగా గద్దెనెక్కిన తర్వాత.. పెద్ద పెద్ద కంపెనీలను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారనీ అన్నారు.
మనం సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలి కాని… సమాజానికి హానికరంగా మారరాదనీ సూచించారు. ఒక వైద్యుడు ఫెయిల్ అయితే రోగి మరణిస్తాడనీ… అదే ఒక ఇంజనీర్ ఫెయిల్ అయితే బ్రిడ్జి కూలిపోతుందనీ… కానీ ఒక పొలిటిషన్ ఫెయిల్ అయితే సమాజమే కుప్పకూలుతుందనీ అన్నారు. నేటి యువత రాజకీయాల్లోకి వచ్చి రాణించాలనీ అన్నారు. పోలీసులు ప్రేరణ కార్యక్రమన్ని ఇక ముందు కూడా కొనసాగించిన యువతను చైతన్య వంతులను చేసి సన్మార్గంలో నడిపించడానికి దోహదపడాలని మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు.