కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుందని, రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే రైతులకు సైతం రైతుబంధు అమలు చేస్తున్నామని తెలిపారు.
కరీంనగర్ జిల్లా ప్రజాపరిషత్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని తేల్చి చెప్పడంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతులకు సూచించిందని తెలిపారు. యాసంగిలో వరి వేసుకునే రైతులు మిల్లర్లు, సీడ్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటేనే వరిసాగు చేసుకోవచ్చని సూచించామని పేర్కొన్నారు. మిల్లర్లు సీడ్ కంపెనీలతో రైతులకు అగ్రిమెంట్ చేయించాలని అధికారులను ఆదేశించారు. ఒప్పందం చేసుకోని రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే రైతులకు సైతం రైతుబంధు అమలు చేస్తున్నామని తెలిపారు. 2018 నుండి 2021 వరకు రూ. 1203 కోట్ల నగదును రైతుల ఖాతాలలో జమచేశామని తెలిపారు.
పామ్ ఆయిల్ సాగుపై రైతులు దృష్టిసారించాలని, ఈ పంట వలన అధిక లాభాలు వస్తాయని మంత్రి తెలిపారు. పామ్ ఆయిల్ సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, సబ్సిడీ కూడా అందిస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ పంటలకు కోతుల వలన ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. ధరణి పోర్టల్ ను చూసి బ్యాంకులు రైతులకు ఋణాలు ఇవ్వాలని, మార్టిగెజ్ అవసరం లేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీ డిప్యూటీ సీఈవో పవన్ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.