హైదరాబాద్ : ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అవమాన పూరిత, నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పై అవమానకరంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధాన్యం సేకరణ అంశాలపై కేంద్ర మంత్రిని ఐదుసార్లు రాష్ట్ర మంత్రుల బృందమే కలిసిందని, ప్రతిసారీ అవహేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడారని దుయ్యబట్టారు. అయినా తెలంగాణ రైతాంగం కోసం వాటన్నింటిని భరించి మొన్నటి రోజున కలిశామని ఈసారి వారి తీరు పరాకాష్టకు చేరుకుంది అన్నారు. తెలంగాణ ధాన్యాన్ని సేకరించాలేమని చెబుతూ, తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించే అలవాటు చేయాలని మాట్లాడారన్నారు. ఈ మాటల్ని ఖండించాల్సిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ కాదా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలకు, రైతులకు అన్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వానికి వంత పాడడం అనైతికమని మండిపడ్డారు. నిజాల్ని వక్రీకరించేలా కేంద్ర మంత్రి హోదాలో అబద్దాలు చెప్పడం హేయమన్నారు. ఒప్పందం చేసిన పరిస్థితులపై కొట్లాడాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి లేదా? అని నిలదీశారు. రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల కేరళకు, 12 వేల మెట్రిక్ టన్నుల కర్ణాటకకు, 60 లక్షల మెట్రిక్ టన్నుల తెలంగాణకు ఒకే సీఎంఆర్ గడువు ఎలా సమంజసం అని ప్రశ్నించారు. ఏప్రిల్ 2వ తేదీ లోగా తెలంగాణ ధాన్యం సేకరిస్తామని కేంద్రం ఉత్తర్వులు ఇవ్వాలి. లేదంటే సీఎం కేసీఆర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మంత్రి కమలాకర్ హెచ్చరించారు.