హైదరాబాద్ : బీసీ సంక్షేమం కోసం పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కేంద్రంలో బీసీ జనగణన లేకుండా కనీసం బీసీ మంత్రిత్వ శాఖ సైతం ఏర్పాటు చేయకుండా బీసీలకు చేస్తున్న ద్రోహంపై సంఘటితంగా పోరాడాలని మంత్రి కమలాకర్ పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన బైరి రవికృష్ణను మంత్రి గంగుల కమలాకర్ సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులతో మంత్రి కమలాకర్ పలు అంశాలపై చర్చించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వెనుకబడిన వర్గాల సంక్షేమం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో బీసీలకు మేలు జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడి మల్లయ్య యాదవ్, గోపాల్ గౌడ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.