Minister Gangula Kamalaker | కరీంనగర్ : ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుందని, అందరం కలిసి మెలిసి ఉన్నాం కాబట్టి కరీంనగర్( Karimnagar )ను గొప్ప నగరంగా అభివృద్ధి చేయగలిగాం అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ( Minister Gangula Kamalaker )అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ( Peace Committee ) సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకొని మత సామరస్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. మతాన్ని కొందరు రాజకీయాలకు వాడుకుంటారని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలనీ, పిల్లల మనసుల్లో మతాల పేరిట విషం నింపకుండ కలిసి మెలిసి ఉండడం నేర్పించాలని సూచించారు. కరీంనగర్కు ఎంతో ఘన చరిత్ర ఉందని, ఒకప్పటి నగరానికి ఇప్పుడు తేడా గమనించాలన్నారు. వేల కోట్ల రూపాయలతో అద్భుత నగరంగా తీర్చి దిద్దుతున్నామని అన్నారు. కరీంనగర్ అభివృద్ధి చూసి నేడు నగరానికి సినీ ఇండస్ట్రీ తమ పెద్ద పెద్ద కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. నగరంలో శాంతి భద్రతలు బాగున్నాయి కాబట్టే పర్యాటకంగా హైదరాబాద్ తరవాత కరీంనగర్ అభివృద్ధి చెందిందని అన్నారు. అందరం కలిసి మెలిసి ఉన్నాం కాబట్టి అభివృద్ధి సాధ్యం అయిందని, సేఫ్ సిటీగా కరీంనగర్ ఖ్యాతిగాంచేలా అన్ని మతాలు కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
అన్ని మతాలను ప్రేమించే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో అన్ని కులాలు మతాలు తమ పండగలను సమానంగా జరుపుకోవాలని క్రిస్మస్, రంజాన్, దసరా పండగలకు దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాబోయే నెలలో పవిత్ర రంజాన్ మాసంలో మీరు కోరుకున్న ఫలాలు దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల సమయంలో మసీదుల వద్ద పరిశుభ్రంగా ఉండేలా శానిటేషన్ పనులు చేయాలని, తాగునీరు ఉండేలా చూడాలని, నల్లా నీరు సమయానుసారం సరఫరా చేయాలని, వీధిదీపాలు వెలిగేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు. నైట్ మార్కెట్లు, ఫ్రూట్, వెజిటేబుల్ మార్కెట్ లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కర్ణన్, సీపీ సుబ్బరాయుడు అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్ శ్యామ్ ప్రసాద్ లాల్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, మేయర్ సునీల్ రావు, పోలీస్, రెవెన్యూ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.