హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన ధాన్యం సేకరణ నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడొద్దని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మిల్లింగ్ చేసిన సీఎంఆర్ను తక్షణమే తీసుకోవాలని కోరారు. బుధవారం సచివాలయంలో తనను కలిసిన మిల్లర్లతో మంత్రి సమావేశమయ్యారు. రైస్ మిల్లర్లు పంపించిన బియ్యాన్ని నిరాకరిస్తూ ఎఫ్సీఐ ఘర్షణాత్మక వైఖరి అనుసరిస్తున్నదని, సరైన స్టోరేజీ కల్పించకుండా, నాఫెడ్ పంపించిన ఫోర్టిఫైడ్ రైస్కెర్నల్ నాణ్యత సరిగా లేదంటూ నిరాకరిస్తున్నదని ఈ సందర్భంగా మిల్లర్లు మంత్రి దృష్టికి తెచ్చారు.
ఏ సీజన్ పంటను ఆ సీజన్లోనే మిల్లింగ్ చేసేవిధంగా చర్యలు తీసుకొనేందుకు మిల్లర్లు సహకరించాలని మంత్రి సూచించారు. మిల్లర్లు ఎదురొంటున్న ఇబ్బందులను ఎఫ్సీఐ ద్వారా కేంద్రానికి చెప్పేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. మిల్లింగ్ ఇండస్ట్రీ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్, సంఘం జనరల్ సెక్రటరీలు వీ మోహన్ రెడ్డి, ఏ సుధాకర్ రావ్, కోశాధికారి చంద్రపాల్ సహ 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.