Minister Gangula | పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించాల్సిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్ డీలర్లపై కూడా అంతే ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం ఓ సామాజిక బాధ్యత అన్న విషయాన్ని డీలర్లు మరవద్దన్నారు. బాధ్యతను విస్మరించి రేషన్ బియ్యం పంపిణీకి ఆటంకం కలిగించేలా రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపునివ్వడం బాధాకరమన్నారు.
ఈ నెల 5 నుంచి రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సచివాలయంలో మంత్రి సోమవారం రేషన్ డీలర్ల జేఏసీతో చర్చలు జరిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పద్మాదేవేందర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషన్ అనిల్కుమార్, జేఏసీ చైర్మన్ నాయికోటి రాజు, వైస్ చైర్మన్ బంతుల రమేశ్ బాబు, కన్వీనర్ దుమ్మాటి రవీందర్, కో కన్వీనర్ గడ్డం మల్లికార్జున్ పాల్గన్నారు. సమావేశంలో జేఏసీ ఇచ్చిన 22 డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. మొత్తం 22 సమస్యలపై 20 సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నామని, ఇందుకు సంబధించి వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. గౌరవ వేతనం, కమీషన్ పెంపు సమస్యలపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. హామీల అమలకు సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. సీఎం కేసీఆర్పై సంపూర్ణ నమ్మకం ఉందని, సీఎం కేసీఆర్ తమ సమస్యలపై పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.