కరీంనగర్ : జిల్లా కేంద్రంలోని రేషన్ దుకాణంలో మంత్రి గంగుల కమలాకర్ ఆకస్మిక తనీఖీ చేపట్టారు. కిసాన్ నగర్ 3 వ డివిజన్లోని 149 వ నంబర్ పౌరసరఫరాల కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు. అక్కడి రిజస్టర్తో పాటు ఈ-పాస్ మిషన్ను పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న నిత్యవసరాల వివరాలను, రేషన్ డీలర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన పరిశీలనలో బయటపడిన ఈ-పాస్ మిషన్ సాంకేతిక సమస్యను అప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను వీలైనంత వెంటనే పరిష్కారించాలని ఫోన్లో ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ మిషన్లలో సాంకేతిక సమస్యలు వస్తున్న విషయాన్ని గుర్తించామని, వీటి స్థానంలో ఆధునాతన ఈ-పాస్ మిషన్లను అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిసెంబర్ వరకు రేషన్ డీలర్లకు సంబంధించిన కమీషన్ విడుదల చేశామని, జనవరి నెలకు సంబంధించిన కమీషన్ కూడా త్వరలోనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని రేషన్ డీలర్లకు మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.