కరీంనగర్: ఎన్నికల సమయంలో గారడి విద్యల్లాంటి మోసపూరిత మాటలు చెప్పేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) ప్రజలకు సూచించారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా, పేదల సంక్షేమం కోసం పనిచేసే బీఆర్ఎస్ పార్టీకి మద్దతివ్వాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో మార్నింగ్ వాకర్స్తో కలిసి ప్రచారం నిర్వహించారు. బ్యాటు చేతపట్టి క్రికెట్ ఆడి యువతను ఉత్సాహపరిచారు.
అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలన్నారు. ఎమ్మెల్యేగా తనన మరోసారి ఎన్నుకుంటే కరీంనగర్ పట్టణాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్పారు.
ప్రస్తుతం కొనసాగుతున్న మానేరు రివర్ ఫ్రంట్ ద్వారా దేశంలోనే కరీంనగర్ గొప్ప నగరంగా మారుతుందన్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలకు, అభ్యర్థులకు అవగాహనే లేదని.. చిత్తశుద్దితో ఎలా పనిచేస్తారని ప్రశ్నిచారు.