Minister Gangula Kamalakar : గుజరాత్లోని సబర్మతి రివర్ ఫ్రంట్(Sabarmati River Front) కన్నా అధునాతనమైన మానేరు రివర్ ఫ్రంట్(Manair River Front)ను నిర్మించడమే తమ లక్ష్యమని గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని మానేరు రివర్ ఫ్రంట్ను ప్రపంచంలోనే అధునాతన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. మొదటి దశలో 3.5 కిలోమీటర్లు, రెండో దశలో 6.25 కిలోమీటర్లు మొత్తం 10 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. కేబుల్ బ్రిడ్జితో మానేరు రివర్ ఫ్రంట్కి సరికొత్త శోభ వచ్చిందని, ఎంఆర్ఎఫ్ లో భాగంగా ఇప్పటికే బిగ్ ఓ ఫౌంటెన్ వర్క్ ప్రారంభమైందని, ప్రస్తుతం 410 కోట్లతో పనులు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.
పెద్ద ఎత్తున వరద వస్తే తట్టుకునే విధంగా ఆఫ్ చెక్ డ్యాం… ఆఫ్ బరాజ్ నిర్మిస్తున్నామని, ఆగస్టులోగా మానేరు మొదటి దశ పనులను పూర్తి చేసి 12 అడుగుల లోతు ఉండేలా నీటిని నిలిపేస్తామని మంత్రి తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ కోసం రూ. 310 కోట్లు, పర్యాటకానికి మరో రూ. 100 కోట్లు కేటాయించామని గంగులు చెప్పారు. పర్యాటకానికి కేటాయించిన రూ.100 కోట్లలో రూ.72 కోట్లతో బిగ్ ఓ ఫౌంటెన్ నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు. స్పీడ్ బోట్ల కోసం 10 కోట్లు, ఎల్లమ్మ దేవాలయం వద్ద ఎంట్రెన్స్ ప్లాజా నిర్మాణానకి ఇంకో 10 కోట్లు, మానేరు రివర్ ఫ్రంట్ కోసం సీఎం కేసీఆర్ మరో 250 కోట్లు మంజూరు చేశారని మంత్రి వెల్లడించారు.
పర్యాటకులను ఆకట్టుకునేలా మానేరు రివర్ ఫ్రంట్లో ఎలాంటి మార్పులు చేపట్టాలనే దానిపై ఓ డెలిగేషన్ బృందాన్ని సీఎం కేసీఆర్ విదేశాలకు పంపిస్తున్నారని మంత్రి గంగులు అన్నారు. ఈ డెలిగేషన్ బృందంలో తనతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ కలెక్టర్ కర్ణణ్ , రజత్ కుమార్, పర్యాటకశాఖ ఎండి మనోహర్ రావులు ఉన్నారని గంగుల చెప్పారు. తాము సింగపూర్తో పాటు దక్షిణ కొరియా, ఓసోలో పర్యటిస్తామని, అక్కడి అధునాతన రివర్ ఫ్రంట్లను అధ్యయనం చేస్తామని మంత్రి అన్నారు. ఒసోలోని ఫౌంటేన్ను పరిశీలించి అంతకంటే అదునాతనమైన ఫౌంటెన్ను కరీంనగర్లో నిర్మిస్తామని ఆయన చెప్పారు. అంతేకాదు సింగపూర్లో అమెరికా టెక్నాలజీతో నిర్మించిన యూనివర్సల్ స్టూడియోని పరిశీలిస్తామని మంత్రి వెల్లడించారు.