కరీంనగర్ : కుల వృత్తులకు జీవం పోసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష సాయం అందజేస్తున్నారని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ( Minister Ganugla ) అన్నారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో 32 మంది కులవృత్తిదారులకు లక్ష సాయం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కులవృత్తి చేసుకునే ప్రతి బీసీ( BC ) కుటుంబం ఆత్మగౌరవంతో బతకాలని అన్నారు. గత ప్రభుత్వల హయాంలో ఇచ్చే రుణాలకు బ్యాంకు గ్యారంటీలు అడిగేవారు. తెలంగాణ ప్రభుత్వం అందజేసే లక్ష సాయానికి ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా, తిరిగి చెల్లించే అవసరం లేకుండా అందజేస్తున్నామని వెల్లడించారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ప్రతి బీసీ కులానికి హైదరాబాద్ నడిబొడ్డున వేలకోట్ల విలువైన భూములు ఆత్మగౌరవ భవనాలకు ( Buildings) కేటాయించామన్నారు. సీఎం కేసీఆర్ ( CM KCR ) అందిస్తున్న లక్ష సాయంతో ప్రతి లేబరు ఓనర్ కావాలని ఆకాంక్షించారు. ఇది నిరంతర ప్రక్రియని ఎవరు నిరాశ పడకూడదని కోరారు.
దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి విడుదలవారీగా సాయం అందిస్తామని స్పష్టం చేశారు. నిజమైన లబ్ధిదారులకు సహాయం అందజేయాలనే సంకల్పం తో పగడ్బందీగా దరఖాస్తులు పరిశీలిస్తున్నామని చెప్పారు . ఈ కార్యక్రమం లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరి శంకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.