హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కొత్త ఆహార భద్రతా కార్డుల జారీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అర్హుల పై కేంద్రం పరిమితులు విధించినా, సీఎం కేసీఆర్ అన్నార్థులు ఉండకూడదని ప్రతీ అర్హునికి రేషన్ కార్డు అందజేస్తున్నారు అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకూ రేషన్ కార్డుల కోసం 9,53,394 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 6,70,999 నూతన రేషన్ కార్డులు అందించామన్నారు. వీటి ద్వారా 21,30,194 మంది లబ్ది పొందుతున్నారని మంత్రి పేర్కొన్నారు. 2016 లో 94,417 కార్డులు(3,30,459 లబ్దిదారులు), 2017లో 36,039 కార్డులు(1,26,136 లబ్దిదారులు), 2018లో 1,65,036 కార్డులు (5,77,626 లబ్దిదారులు), 2019లో 64,471 కార్డులు (2,25,649 లబ్దిదారులు), 2020లో 11 కార్డులు (39 లబ్దిదారులు), 2021లో 3,11,025 కార్డులు (8,70,285 లబ్దిదారులు) అందజేశామన్నారు.