బీసీల ఆత్మబంధువుగా.. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం నిలిపే విదంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మించబోయే బీసీ ఆత్మగౌరవ భవనాలకు సంబందించి ఏకసంఘంగా రిజిస్టరైన పది కులసంఘాలకు పిభ్రవరి 2న పత్రాలను అందజేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. గత డిసెంబర్లో అన్ని కులసంఘాలతో సమావేశం నిర్వహించి బీసీ కులాల్లోని సంఘాలన్నీ ఆత్మగౌరవ భవనం కోసం ఏక సంఘంగా ఏర్పడి కామన్ రిజిస్టర్డ్ ట్రస్ట్, అసోసియేషన్గా ఏర్పడాలని సూచించామని, అలా ఏర్పడిన ఏకసంఘానికి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం అనుమతులు ఇస్తున్నామని మత్రి తెలిపారు. దానికి అనుగుణంగా పది బీసీ కులాలు.. ఎల్లాపి, మేదర, పెరిక, నకాస్, బసవేశ్వర లింగాయత్, రంగ్రేజ్ భవసార, అగర్వాల్ సమాజ్, నీలి, జాండ్ర, తెలంగాణ మరాట మండల్ కులాలకు చెందిన సంఘాలన్నీ కలిసి ఏక సంఘంగా ఏర్పడి ప్రభుత్వానికి తమ సమ్మతిని తెలియజేస్తూ సంబందిత పత్రాలను అందజేసారని, వారందరికీ ఫిబ్రవరి 2న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పత్రాలు అందజేస్తామన్నారు. ఆ వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించి అతి త్వరలోనే ఆత్మగౌరవ భవనాల్ని నిర్మిస్తామన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని దాదాపు 5 వేల కోట్ల రూపాయల విలువ చేసే 82 ఎకరాల స్థలాలను 41బీసీ కులాలకు కేటాయించారని మంత్రి అన్నారు. అలాగే.. ఎకరాకు కోటి చొప్పున నిధుల్ని సైతం అందజేసి నిర్మాణంలో ఆయా కులాలకే పూర్తి అధికారాలతో అనుమతులు అందజేస్తున్నామన్నారు. వారి కులం ఆత్మగౌరవం ప్రతిబింబించేలా నిర్మాణం చేసుకోవాలని, వీటిపై నిరంతరం ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందన్నారు. మిగతా సంఘాలు సైతం త్వరలోనే నిర్ణయం తీసుకొని ఏక సంఘగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాల్ని త్వరగా నిర్మించుకోవాలని ఈ సందర్బంగా మంత్రి పిలుపునిచ్చారు.