Minister Gangula | లోకానికే అన్నంపెట్టే అన్నదాతకే అన్నం పెట్టడం పూర్వజన్మ సుకృతమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు పస్తులు ఉండొద్దనే ఉద్దేశంతో మంత్రి సొంత డబ్బులతో కరీంనగర్ ఏఎంసీ పాలకవర్గం రైతులకు మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. శనివారం కార్యక్రమంత్రి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు ఏఎంసీ రైతులకు భోజనం అందిస్తున్న పాలకవర్గాన్ని అభినందించారు. ఉమ్మడి పాలనలో ఎన్నో కష్టాలు పడ్డామని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారాయన్నారు. కాళేశ్వరం జలాలను తీసుకువచ్చి మండుటెండల్లో మత్తడులు దూకుతున్నాయని, ఈ ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయని, భూమికే బరువయ్యేలా పంటలు పండుతున్నాయన్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తున్నామన్నారు. తెలంగాణ పచ్చగా ఉండడం, రైతులు సంతోషంగా ఉండడం చూసి ఢిల్లీ పార్టీలు విషం చిమ్ముతున్నాయని ఆరోపించారు. ఢిల్లీ గద్దలు ఇక్కడి నీటిని, బొగ్గు, కరెంటును దోచుకుపోయి మళ్లీ తెలంగాణ గుడ్డిదీపం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, తెలంగాణ రక్షకుడిగా సీఎం కేసీఆర్ వారిపై యుద్ధం చేస్తున్నారన్నారు. తెలంగాణ రక్షకుడు కేసీఆర్ మాత్రమేనని, ఆయనకు అండగా ఉంటూ తెలంగాణ కాపాడుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.