రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్.. కరీంనగర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు. కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, మంత్రిగా ఇక్కడి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేత. మంచితనం, మానవత్వం ఉన్ననేత. తన నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఆపదలో ఉన్న ఎవరినైనా ఆదుకునేందుకు ముందుకు వచ్చే వ్యక్తిత్వం ఆయన సొంతం. ఆయనను కరీంనగర్ ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు.
కరీంనగర్ ప్రజలకు, ఆఖరికి శత్రువుకైనా సహాయ చేయడంలో మంత్రి గంగుల కమలాకర్ ముందుంటారు. ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతున్న రోజుల్లో ఆయన ప్రజల మధ్యనే ఉండి సేవలు అందించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు నాలుగు 108 వాహనాలను తన సొంత డబ్బులతో అందించారు. అందులో అధునాతన వైద్య పరికరాలు అమర్చారు. కరీంనగర్ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న ఈ వాహనాలు ఇప్పుడు జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఆపదలో ఉన్న ప్రజలను దవాఖానలకు తరలించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ఉద్యమ నేత కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తున్న మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ నియోజకవర్గంలో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. పార్టీ అధిష్ఠానం నాలుగో సారి కూడా ఆయనకే అవకాశం కల్పించింది. తాను చేసిన అభివృద్ధ్దే తనను గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. గంగులపై పోటీ చేయాలంటే పోచమ్మ గుడి ముందు కట్టేసిన పొట్టేలు లెక్కనేనని ఇటీవల కరీంనగర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో చర్చకు దారితీశాయి. ఇది అక్షరాల నిజమని ప్రజలు అంటున్నారు.
మంత్రి గంగుల కమలాకర్కు రైతులంటే ఎనలేని ప్రేమ. రైతు బిడ్డగా వారి సమస్యలపై స్పందించడంలో ముందుంటారు. 2009లో తాను మొదటి సారి ఎమ్మెల్యే అయినపుడు ఇక్కడ అంతట దుర్భిక్ష పరిస్థితులు ఉండేవి. సాగు నీటికోసం రైతులు అల్లాడి పోయేవారు. కరెంట్ లేక అష్టకష్టాలు పడేవారు. అలాంటి సందర్భంలో ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి రైతుల పక్షాన నిలిచారు. సాగు నీటికోసం ఏకంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎల్ఎండీ రిజర్వాయర్ రెగ్యులేటర్ వద్ద ఇసుక బస్తాలు వేసి నీటి తరలింపును అడ్డుకున్నారు. తన జిల్లా రైతులకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే మిగతా జిల్లాల రైతులకు ఇవ్వాలని ఆ రోజుల్లోనే నినదించారు. కరెంట్ కోసం రైతులతో కలిసి ఆందోళనల్లో పాల్గొనేవారు. ఆయన ఆందోళనలో పాల్గొన్నాడంటే ప్రతి రైతుకూ కొండంత ధైర్యం వచ్చేది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని రైతుల సమస్యలపై ఎలుగెత్తేవారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రైతుల కోసం ఆయన అహర్నిషలు పాటుపడుతున్నారు. తన అన్న గంగుల ప్రభాకర్ మరణించగా ఆయన పేరుతో కరీంనగర్ మండలంలోని ముగ్దుంపూర్లో, కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లిలో రెండు రైతు వేదికలు తన సొంత డబ్బులు రూ.44 లక్షల ఖర్చులతో నిర్మించి రైతుల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. అందుకే కరీంనగర్ రైతులు ఆయనను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నారు.