హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీసీ ఆత్మగౌరవ భవనాలపై మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మినిస్టర్స్ క్వార్టర్స్లో నిర్వహించిన సమీక్షలో బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ ఇన్ర్పాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఉన్నతాధికారులు, హెచ్ఎండీఏ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెలాఖరు వరకు అన్ని భవనాలు టెండర్లు పూర్తి చేసి.. మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
వెనుకబడిన వర్గాలపై ఆపేక్షతో వేలకోట్ల విలువ చేసే కోకాపేట, ఉప్పల్ బగాయత్ తదితర విలువైన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ 87.3 ఎకరాలు, రూ.95.25 కోట్లను 41 బీసీ సంఘాలకు కేటాయించారన్నారు. ఆయా కులాల ఆత్మగౌరవం ప్రతిఫలించేలా నిర్మించుకోవడానికి కుల సంఘాల ట్రస్టులకే నిర్మాణ బాధ్యతలు సైతం అప్పగించినట్లు తెలిపారు. 13 సంఘాలు సొంతంగా భవానాల్ని నిర్మించుకుంటున్నాయని, మిగతా భవనాలను ప్రభుత్వమే నిర్మిస్తుందన్నారు.
ఇప్పటికే 10 ఎకరాలు రూ.10 కోట్లతో యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలను కోకాపేట్లో తీర్చిదిద్దామని ఇవి తుది దశలో ఉన్నాయన్నారు. మరో మూడు సంఘాల భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచామన్నారు. మిగతా 18 సంఘాలకు సైతం నెలాఖరులోపు టెండర్లు ఖరారు చేయాలని అదేశించారు. అదేవిదంగా ట్రస్టులు ఈ నెల 5, 7 తారీఖుల్లో భూమిపూజ పూర్తి చేసుకున్నాయని, వీటిలో ఆత్మగౌరవ భవన నిర్మాణాలను సైతం మార్చి నుంచి ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలన్నారు మంత్రి ఆదేశించారు.
ఇప్పటికే కోకాపేట, ఉప్పల్ భగాయత్లో హెచ్ఎండీఏ అభివృద్ధి పనులను చేపట్టిందని, కోకాపేటలోని ప్రతీ ఆత్మగౌరవ భవనానికి అప్రోచ్ రోడ్లు, తాగునీరు, విధ్యుత్ వంటి మౌళిక సదుపాయాలు ఈ నెలాఖరుకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన నోడల్ ఆఫీసర్లు నిరంతరం ఆయా కుల సంఘాలతో సంప్రదింపులు జరుపుతూ వారి కుల ఆత్మగౌరవం ఇనుమడించేలా నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డీడీ సంధ్య, రజక ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్, టీఎస్ డబ్ల్యూఐడీసీ సీఈ అనిల్ కుమార్, ఈఈ కుమార్ గౌడ్, ఎస్ఈ శైలేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.