హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): బీసీ కులవృత్తుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 9న నిర్వహించననున్న సంక్షేమ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం సచివాలయం నుంచి ఆర్థిక మంత్రి హరీశ్రావు(సంగారెడ్డి నుంచి), సీఎస్ శాంతికుమారితో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కులవృత్తుల్లో ఉన్నవారికి బ్యాంకు లింకేజీ లేకుండా లక్ష గ్రాంటును అందించే విషయంపై, దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
గొప్ప కార్యక్రమంలో కలెక్టర్లతో పాటు జిల్లా యంత్రాంగం సంపూర్ణంగా పని చేయాలని కోరారు. మంచిర్యాలలో జూన్ 9న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం చెకుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని, అదే రోజున నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ప్రారంభిస్తారని వెల్లడించారు. పథకం దుర్వినియోగానికి ఆసారం లేకుండా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇది నిరంతర కార్యక్రమమని, లబ్ధిదారులను గుర్తించి ప్రతినెలా 15వ తేదీన ఎమ్మెల్యేలు చెకులు అందజేస్తారని మంత్రి తెలిపారు.
పథకం గ్రౌండింగ్లో ఆయా కులవృత్తులకు దోహదపడే పనిముట్లు, పరికరాలు కొనుకోవడానికి సహకరించడంతో పాటు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని చెప్పారు. మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ పేద చేతివృత్తిదారులను గుర్తించి, ఆర్థిక చేయూతనిచ్చేలా కలెక్టర్లు శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమ విజయవంతానికి ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వీసీలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బీ వెంకటేశం, ఎస్సీ డెవలప్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కలెక్టర్లు, బీసీ సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు.